అసాంఘిక శక్తుల అడ్డా: జగన్ పార్టీపై వర్ల రామయ్య
గుంటూరు: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసుపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్సి వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులకు అడ్డాగా, నేరస్తులకు నిలయంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం గుంటూరులో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
జగన్ తనలా జైలు జీవితం గడిపిన వాళ్లందరిని తన పార్టీలోచేర్చుకొనేందుకు గేట్లు తెరిచారని చెప్పారు. శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసులో చేరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఘనమైన నేరచరిత్ర ఉందని ఆరోపించారు. మోపిదేవి వాన్పిక్లో క్విడ్ ప్రోకోకు పాల్పడటమే కాకుండా బ్లాక్ ఈగిల్ బీరు కంపెనీకి ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సమయంలో పరిమితికి మించి అనుమతులు ఇచ్చి తన కుమారుడికి రెండు చోట్ల డీలర్షిప్పులు ఇప్పించుకొన్నారని చెప్పారు. సారా సిండికేట్ను ప్రోత్సహించారని విమర్శించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన మద్యం వ్యాపారి ఒకరు తాను మోపిదేవి కార్యాలయంలో రూ. 10 లక్షలు లంచంగా ఇచ్చినట్లు చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మోపిదేవి చంచల్గూడ జైలులోనే వైయస్సార్ కాంగ్రెసు కండువా వేసుకొంటే సరిపోయేదన్నారు. ఇదే రీతిలో రేపో, మాపో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి కూడా జగన్ పార్టీలో చేరబోతున్నారని అన్నారు. క్విడ్ ప్రోకో కేసుల్లో నిందితులుగా ఉన్న వారందరికి త్వరలో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జగన్ అవకాశం కల్పించబోతున్నారని స్పష్టం చేశారు.
జగన్ తల్లి విజయలక్ష్మి బైబిల్ చేతబట్టుకొని యువత తన కుమారుడిని ఆదర్శంగా తీసుకోవాలని మనస్సాక్షిగా చెప్పగలరా అని ప్రశ్నించారు. జైలు నుంచి రాగానే జగన్ గ్రాఫ్ పడిపోయిందని, మరో 15 రోజులు పోతే ఆ పార్టీ వైపు చూసే ప్రజలే ఉండరన్నారు. జనవిజ్ఞాన వేదిక నేత లక్ష్మణ్రెడ్డి జగన్ అనుకూలంగా చంద్రబాబుపై ఆరోపణలు చేస్తుండటం తగదని రామయ్య హెచ్చరించారు.












Click it and Unblock the Notifications