రఘురామకు షోకాజ్ నోటీస్: గడువు వారం రోజులే: ఆపై మా ఇష్టం.. చర్యలకు సిద్దం: తేల్చేసిన వైసీపీ
అమరావతి: ఊహించినట్టే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుపై చర్యలకు దిగింది పార్టీ అగ్ర నాయకత్వం. ఈ మధ్యకాలంలో తరచూ సొంత పార్టీపైనే నిప్పులు చెరుగుతోన్న రఘురామ దూకుడుకు బ్రేక్ వేయనుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలను విమర్శించడమే కాకుండా.. వారి నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారాయన, అక్కడితో ఆగలేదు- ఈ విషయాన్ని ఏకంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికీ తీసుకెళ్లారు.

వారం రోజుల్లో సంతృప్తికరమైన వివరణ..
ఈ వరుస పరిణామాలతో వైసీపీ నాయకత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా- బుధవారం షోకాజ్ నోటీసులను జారీ చేసింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత, జాతీయ కార్యదర్శి వీ విజయసాయి రెడ్డి ఆయనకు రెండు పేజీల ఈ షోకాజ్ నోటీసులను ఇచ్చారు. షోకాజ్ నోటీసులను జారీ చేయడానికి ఏర్పడిన కారణాలను సమగ్రంగా వివరించారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనికి వారం రోజుల గడువు విధించారు.

బొచ్చులో నాయకత్వం అంటూ..
అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సొంత పార్టీ ఎంపీ నుంచి విమర్శలు, ఆరోపణలను చవి చూడాల్సి వచ్చింది వైఎస్ఆర్సీపీకి. కొంతకాలంగా ఆయన పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బొచ్చులో నాయకత్వం.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సైతం ఆయన విమర్శించినట్లు వైసీపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని సాయిరెడ్డి తన షోకాజ్ నోటీసులోనూ పొందుపరిచారు. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని రఘురామకు గుర్తు చేశారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే..
రఘురామ కృష్ణంరాజు పార్టీ అగ్ర నాయకత్వానికి కొరుకుడు పడట్లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నర్సాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసుకుని ఘాటు విమర్శలు చేస్తూ వచ్చారు. ఇసుకను ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇళ్ల పట్టాల కేటాయింపుల్లోనూ అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలను గుప్పించారు.

ప్రభుత్వ పథకాలపైనా
వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న సంక్షేమ పథకాలపైనా రఘురామ కృష్ణంరాజు విమర్శలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్ధక భూముల విక్రయాలు, మూడు రాజధానుల ఏర్పాటు.. వంటి పలు పథకాలు, నిర్ణయాలపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ తనను బతిమాలితేనే వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నానని, తన వల్లే నర్సాపురం ఎంపీ సీటును వైసీపీ గెలుచుకోగలిగిందనీ వ్యాఖ్యానించారు.
Recommended Video

తీవ్రంగా పరిగణించిన వైసీపీ
రఘురామ చేసిన వ్యాఖ్యలను వైసీపీ అగ్ర నాయకత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీన్ని క్రమశిక్షణ నిబంధనల ఉల్లంఘనగా భావిస్తోంది. పార్టీ నిబంధనలు, కట్టుబాట్లను మీరి రఘురామ వ్యాఖ్యలు చేశారని నిర్ణయానికి వచ్చింది. తాము నిషేధించిన న్యూస్్ ఛానళ్లలో డిబేట్లకు హాజరు కావడం వంటి అంశాలపై ఇదివరకే అసహనాన్ని వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. మొదట చూసీ చూడనట్టు వ్యవహరించాలని భావించినప్పటికీ.. ఆయన మాటల తీవ్రత తగ్గకపోవడంతో షోకాజ్ నోటీసులను జారీ చేసింది.












Click it and Unblock the Notifications