Jagananne Maa Bhavishyatthu : వైసీపీ మరో భారీ కార్యక్రమం-14 రోజుల్లో 1.6 కోట్ల కుటుంబాల చెంతకు..
ఏపీలో నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వైసీపీ.. ఓవైపు విపక్షాల విమర్శల్ని తిప్పికొడుతూ మరోవైపు ఎన్నికలకు ఓటర్లను సమాయత్తం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నాలుగేళ్లలో ప్రజలకు చేసిన మంచిని వారికి గుర్తుచేస్తూ, మధ్యలో గత ప్రభుత్వాల పాలనతో దాన్నిపోలుస్తూ ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఓ భారీ కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
జగనన్నే మా భవిష్యత్తు (Jagananne Maa Bhavishyatthu) పేరుతో కేవలం 14 రోజుల్లో కోటీ 60 లక్షల కుటుంబాలకు చేరువయ్యేలా ఓ భారీ కార్యక్రమానికి వైసీపీ రూపకల్పన చేసింది. ఏప్రిల్ 7 నుంచి 20వ తేదీ వరకూ 14 రోజుల పాటు అంటే రెండు వారాల పాటు రాష్ట్రాన్ని చుట్టేయాలని పార్టీ భావిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఇవాళ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం లక్ష్యం, జరిగే తీరు వంటి అంశాలపై మీడియాతో మాట్లాడారు.

సచివాలయ కన్వీనర్లు గృహ సారథులను సమన్వయం చేసుకుంటూ భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సజ్జల తెలిపారు.ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేందుకు భారీ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈ నెల 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నారు. 7 లక్షల మంది కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు.వలంటీర్లు .గృహ సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
స్ధానిక శాసన సభ్యులు, రీజినల్ కో ఆర్డినేటర్ల నేతృత్వంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం జరుగుతుందని సజ్జల తెలిపారు. జగనన్నే మా భవిష్యత్... మా నమ్మకం నువ్వే జగన్ అనేది జనంలోంచి వచ్చిన నినాదమన్నారు.ప్రజల జీవితాల్లో మార్పు రావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మేనిఫెస్టో అమలు దగ్గర్నుంచి లక్ష్యం చేరే వరకు పేదల కుటుంబాల్లో వెలుగు కోసమే సీఎం జగన్ ప్రయత్నమన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో మార్పు కనిపిస్తోంది అనేది ప్రజల మాటల్లో అర్ధం అయిందన్నారు.
గత ప్రభుత్వానికీ, ఈ ప్రభుత్వానికీ మధ్య ఉన్న తేడాపై ఈ కార్యక్రమంంలో ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని సజ్జల తెలిపారు.జగన్ ప్రతినిధులుగా గృహసారధులు, పార్టీ కార్యకర్తలు వెళ్తున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్షాల పేరుతో జరుగుతున్న కుట్రలకు చెక్ పడుతుందని సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications