చిన్న శ్రీను బాటలోనే మరో వైసీపీ ముఖ్య నేత, భారీ కుదుపు..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ఇదే సమయంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయనగరం జిల్లా వైసీపీలో అనూహ్య సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా చిన్ని శ్రీను టీడీపీలో చేరారు. తన కుమార్తెకు స్థానిక ఎన్నికల్లో సీటు పైన హామీ పొందినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో చిన్ని శ్రీను బాటలోనే జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత.. బొత్సా బంధువు పార్టీ మారేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.
విజయనగరం కేంద్రంగా స్థానిక ఎన్నికల వేళ రాజకీయ లెక్కలు మారుతున్నాయి. జడ్పీ చైర్మన్ చిన్నశ్రీను వైసీపీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరిన తరువాత ఆసక్తి కర రాజకీయం మొదలైంది. తాజా గా ఆయన బావ బడ్డుకొండ అప్పలనాయుడు కూడా ఇదే నిర్ణయంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బొత్సా కుటుంబంలో చీలిక కనిపిస్తోంది. చిన్న శ్రీను, ఆయన కుమార్తె సిరి సహస్ర టీడీపీలో చేరటంతో ఇంకా ఎంతమంది వైసీపీ వీడుతారనేది స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నడవనున్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తరువాత కూడా బడ్డుకొండ అప్పలనాయుడు అనుకున్న స్థాయిలో క్రియాశీలకంగా లేరు. పైగా పూసపాటి అశోక్గజపతి రాజుకు గవర్నర్ ఎంపిక సమయంలో బహాటంగానే ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాకు వన్నె తెచ్చారంటూ కొనియాడారు. ఇప్పుడు బావ చిన్న శ్రీను పార్టీ మారడంతో ఆయన సైతం అనుసరిస్తారన్న ప్రచారం జిల్లా వర్గాల్లో ఉంది.

జిల్లాలో మారుతున్న సమీకరణాలు
జిల్లా వైసీపీలో బొత్స రాష్ట్రస్థాయి నాయకుడిగా మారిన తరువాత జిల్లా వ్యవహారాలను చిన్నశ్రీనే అన్నీతానై చూసుకున్నారు. 2018లో జగన్ పాదయాత్ర సమయంలో, అటు తరువాత 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా చిన్న శ్రీను కనుసన్నల్లో వ్యవహారాలు నడిచేవి. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరడంతో మద్దతు దారులు అటు వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. తక్షణ ప్రభావం చూపే నియోజకవర్గం మాత్రం చీపురుపల్లి. ఆ నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో వైసీపీ కేడర్ చెల్లాచెదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలోనూ ప్రభావం ఉండనుంది. ఎస్.కోట, బొబ్బిలి నియోజకవర్గాల్లో వైసీపీ కేడర్తో చిన్నశ్రీనుకు సంబంధాలు ఎక్కువ. అయితే, చిన్ని శ్రీను పార్టీ మారటం తో జిల్లా రాజకీయాల్లో రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications
