చంద్రబాబుపై విసుర్లు: 'టీడీపీ, వైసీపీ బద్ధ శత్రువులైనా పోరాడేందుకు సిద్ధం'
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా సాధించకలేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా పై చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇస్తామని గతంలో కేంద్రం ప్రకటించిందని, అయితే ఇచ్చిన హామీని కూడా సాధించుకోలేకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా ఎన్టీఏలో టీడీపీ ఎలా కొనసాగుతోందని విమర్శించారు.

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేవలం స్వప్రయోజనాల కోసమే టీడీపీ ఆ విధంగా చేస్తోందని ఆరోపించారు. హోదాపై చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడుతున్నారని, హోదా ఏమైనా సంజీవని వంటిదా అని ఆయన గతంలో అన్నారని, ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారని మండిపడ్డారు.
చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారనే పేరు చంద్రబాబు తెచ్చుకోవచ్చేమో గానీ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాని తీసుకుని రాలేకపోతే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు.
రాష్ట్రంలో టీడీపీ, వైసీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయని, అయినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశంతో కలిసి పోరాడేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు.
ఏపీకీ ప్రత్యేక హోదా సాధించుకోవాలంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో లేని రాజకీయపార్టీలను కూడా పిలిచి సలహాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు మార్గదర్శకంగా ఉండాలని, ఒక ఉద్యమరూపం తీసుకురావాలని కోరారు. కేంద్రంలో టీడీపీ మంత్రులను, ఏపీలో బీజేపీ మంత్రులను కొనసాగిస్తూ ప్రత్యేకహోదా కోసం పోరాడతామంటే కుదరదని అన్నారు.
ఎవరొచ్చినా, రాకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని రాష్ట్ర ప్రయోజనాలే తమ పార్టీ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమంటూ లోక్సభలో కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి సిన్హా ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు భగ్గుమంటున్నాయి.
విజయవాడలో కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ కేంద్ర ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ని బీజేపీ, టీడీపీ కలిసే మోసం చేశాయంటూ వారు నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications