పోలవరం ఇష్యూ: చంద్రబాబుకు బొత్స చురకలు, విశాఖ సంద్రం సైతం...
విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టుకు చెందిన కొన్ని పనుల టెండర్లు నిలిపేయాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని ఆదేశించడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్రం భావించిందని ఆయన అన్నారు. పోలవరం నిర్మాణం కేంద్రం బాధ్యత అయినప్పటికీ చంద్రబాబు కమీషన్ల కోసమే నిర్మాణ బాధ్యత తీసుకున్నారని ఆరోపించారు.
చంద్రబాబు గట్టిగా ఎందుకు అడగడం లేదు...
మిత్రపక్షం అయినంత మాత్రాన బిజెపిని చంద్రబాబు ఎందుకు గట్టిగా అడగడం లేదని బొత్స ప్రశ్నించారు. పోలవరం అనుకున్న సమయానికి పూర్తి కాదని, దీనికి చంద్రబాబే కారణమని ఆయన అన్నారు. కనీసం ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు పిలిస్తే సై...
పోలవరం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు అఖిలపక్షాన్ని తీసుకెళ్తే ఢిల్లీకి తాము కూడా వెళ్తామని బొత్స అన్నారు. పోలవరం, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, రాష్ట్రం కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని ఆయన అన్నారు.
పోలవరం జీవనాధారం...
పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కు జీవనాధారమని బొత్స సత్యనారాయణ అన్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించారని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వైఎస్ అనుమతి తెచ్చారు....
పోలవరానికి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని, భూ సేకరణ మొదలుపెట్టింది కూడా ఆయనేనని బొత్స అన్నారు. హైదరాబాద్కు మెట్రో రైలు తానే తెచ్చానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని బొత్స విమర్శించారు. రేపు విశాఖకు సముద్రాన్ని తానే తెచ్చానని కూడా ఆయన చెప్పవచ్చునని బొత్స అన్నారు.
సిఎం చర్యలు రాష్ట్రానికి నష్టం...
సీఎం చర్యలు రాష్ట్రానికి నష్టం కలిగించేలా ఉన్నాయి. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించారని, పోలవరాన్ని తామే కడతామని కేంద్రం చెప్పినా సహకరించకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుపడిందని బొత్స అన్నారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు సొంత ప్రయోజనాలకు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పోలవరంపై కేంద్రం ఇప్పటికే అభ్యంతరాలు చెప్పిందని, కాంట్రాక్టర్లను మారిస్తే నాణ్యత లోపిస్తుందని కేంద్రం చెబుతోందని ఆయన అన్నారు.
కేంద్రం నుంచి ఎందుకు...
పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రాష్ట్రం ఏందుకు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. విశాఖకు రైల్వేజోన్ ఏమైందని, ప్రత్యేక హోదా ఏమైందని, గిరిజన వర్సిటీ ఏమైందని, మీరిచ్చిన హామీలేమయ్యాయని బొత్స చంద్రబాబును అడిగారు. జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని, ప్రతిపక్షం అడిగితే టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని ఆయన అన్నారు.