సుప్రీంను ఆశ్రయించిన దేవినేని అవినాష్..! కూటమి సర్కార్ వేటతో..
విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు అవినాష్ బెయిల్ ను తిరస్కరించిన నేపథ్యంలో పోలీసులు విజయవాడతో పాటు హైదరాబాద్ లోనూ గాలింపు చేపట్టారు. దీంతో అరెస్టు తప్పించుకునేందుకు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

త వైసీపీ ప్రభుత్వంలో రెండేళ్ల క్రితం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పలు కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ తో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఇంకా దేవినేని అవినాష్ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన నేతల అరెస్టు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే హైకోర్టు ఈ కేసులో దేవినేని అవినాష్ తో పాటు ఇతర వైసీపీ నేతలు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. దీంతో వీరిలో ఒక్కొక్కరిగా పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని అవినాష్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రేపు అవినాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అవినాష్ కు ఊరట లభించకపోతే మాత్రం పోలీసులు కచ్చితంగా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ ఊరట లభిస్తే మాత్రం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే అరెస్టు అయిన నిందితులు సైతం బెయిల్ పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications