YSRCP నాయకుడి ఆత్మహత్యాయత్నం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో కార్యకర్తలకే ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తున్నారు. పార్టీకి వారే సారథులు అని నిర్మొహమాటంగా చెబుతున్నారు. అన్ని విధాలుగా వీరికి అండగా నిలవాల్సిన నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ కు సొంత పార్టీ నాయకుల నుంచే నిరసన వ్యక్తమైంది. ఇక్బాల్ కు నియోజకవర్గ పరిధిలో విమర్శల తాకిడి తీవ్రంగా ఉంది. ఈ కోవలోనే చిలమత్తూరు మండలంలోని తుమ్మల గుంటలో 'గడప గడపకు మన ప్రభుత్వం'లో పాల్గొనడానికి వచ్చారు.
ఇక్బాల్ తమకు చెప్పకుండా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారని, ఆయన తమ గ్రామానికి రావొద్దంటూ స్థానిక ఎంపీటీసీ భర్త, వైసీపీ నేత నాగరాజు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై నాగరాజును నివారించారు. తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించడమేంటని, తమ నాయకుడు ఆత్మహత్యాయత్నం చేసినా తనకేం పట్టనట్లుగా ఇక్బాల్ కార్యక్రమాలు నిర్వహించారంటూ నాయకులు మండిపడ్డారు. దీంతో హిందూపురంతోపాటు చిలమత్తూరు మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇటీవలే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకు గురయ్యారు. ఇందులో ఇక్బాల్ పాత్ర ఉందంటూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. తనకేం సంబంధం లేదని ఆయన ప్రకటించారు. తర్వాత కొన్ని ఆడియోలు బయటకు రావడంతో ఎమ్మెల్సీ పీఏతోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications