'బ్రహ్మాండమంటే కేంద్రం సాయం చేస్తుందా': బాబు అనుభవం ఉపయోగించాలని వైసిపి
దేశ జిడిపి కంటే ఏపీ జిడిపి ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, ఇవన్నీ కాకి లెక్కలు అని వైసిపి నేత పార్థసారథి గురువారం విమర్శించారు.
విజయవాడ: దేశ జిడిపి కంటే ఆంధ్రప్రదేశ్ జిడిపి ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నారని, ఇవన్నీ కాకి లెక్కలు అని, ఆయన చెబుతున్నవి ఎక్కడ వాస్తవాలకు దగ్గరగా లేవని వైసిపి నేత పార్థసారథి గురువారం విమర్శించారు.
రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సాయం చేస్తుందని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ది రేటు ఏపీలో ఉందని చెబితే దానిని ఎవరైనా నమ్మగలరా అని ప్రశ్నించారు. మాయమాటలతో ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టవద్దన్నారు.
వ్యక్తిగత ఇమేజ్ కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని ఆరోపించారు. ఇలా చేయవద్దన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందన్నారు.
ఇందుకు నిరసనగా శుక్రవారం నాడు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని పార్థసారథి చెప్పారు. ఒంగోలు కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు ప్రభుత్వం కళ్లు తెరిపిస్తుందన్నారు.