అదానీతో మా ఒప్పందాలు రద్దు చేసే దమ్ముందా ? చంద్రబాబుకు పేర్ని సవాల్..
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ ఏపీలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం గత వైసీపీ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటి విషయంలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఇవాళ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిపై వైసీపీ నేత పేర్ని నాని ఘాటుగా స్పందించారు. చేతనైతే తమ ఒప్పందాలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో సౌర విద్యుత్ కోసం ఒప్పందాలు చేసుకుందని, వాటిని రద్దు చేసే దమ్ముందా అని సీఎం చంద్రబాబును పేర్నినాని ప్రశ్నించారు. అదానీతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటే ఒకలా, జగన్ ఒప్పందాలు చేసుకుంటే మరోలా చిత్రీకరిస్తున్నారని టీడీపీ అనుకూల మీడియాపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారని, తాము వాటిని తగ్గించి ఒప్పందాలు చేసుకున్నామని గుర్తుచేశారు.

అదానీతో గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని, తాము నేరుగా కేంద్ర ప్రభుత్వ సంస్ధ సెకీతో ఒప్పందాలు చేసుకున్నామని పేర్ని నాని తెలిపారు. సెకీ ఎవరి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుందో తమకు అనవసరం అన్నారు. గతంలో జగన్ కంటే ఏడాదిన్నర ముందు చంద్రబాబు అదే సెకీతో ఒప్పందాలు చేసుకోలేదా అని పేర్ని ప్రశ్నించారు. అదే సమయంలో మిగతా రాష్ట్రాల్లో అంత కంటే తక్కువ ధరకు విద్యుత్ కొంటే చంద్రబాబు మాత్రం ఎందుకు ఎక్కువ ధరకు కొన్నారని పేర్ని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications