రేట్లు తగ్గాయ్- ఇక్కడే కొనండి- ఏపీ మందుబాబులకు పీవీపీ ఉచిత సలహా...
ఏపీలో మద్య విధానంపై రోజుకో రకంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం గతేడాది మద్య విధానం తీసుకొచ్చిన నాటి నుంచి మద్యం బాటిళ్లు, బ్రాండ్లు, వాటి ధరలపై చర్చ జరుగుతూనే ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను స్వాధీనం చేసుకున్న వైసీపీ సర్కారు.. ఇప్పుడు తామే వాటి సంఖ్యను తగ్గిస్తూ ధరలు పెంచుతూ విక్రయాలు సాగిస్తోంది.
మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే 33 శాతం షాపులను మూసేయడంతో పాటు 75 శాతం మేర ధరలు పెంచింది. తాజాగా కూడా ఛీఫ్ లిక్కర్, బీర్ల ధరలను తగ్గించి మిగతా ప్రీమియం బ్రాండ్ల ధరలన్నీ పెంచేసింది. రాష్ట్రంలో పేదలు తాగే ఛీప్ లిక్కర్ బ్రాండ్ల ధరలను తగ్గించడం ద్వారా శానిటైజర్లు తాగి చనిపోతున్న వారి చావులను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఛీఫ్ లిక్కర్ సేవించే వారికి కాస్త ఊరట దక్కింది. ప్రభుత్వ తాజా నిర్ణయంపై వైసీపీ ప్రభుత్వంతో పాటు నేతల్లోనూ సానుకూలత వ్యక్తమవుతోంది.

వైసీపీ ప్రభుత్వం తాజాగా మద్యం ధరలు తగ్గించింది కాబట్టి ఇక పొరుగు రాష్ట్రాలకు వెళ్లి కొనొద్దని, ఇక్కడే కొనడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని వైసీపీ నేత మందుబాబులకు సలహా ఇచ్చారు. మీరు ఊర్లలోనే మద్యం కొంటే ఆ ఆదాయమేదో ఇక్కడ ప్రభుత్వానికే వస్తుందిగా.. ధరలు కూడా తగ్గించారంటూ పీవీపీ ట్వీట్ చేశారు. అలా అని ఎక్కువ తాగొద్దంటూ పీవీపీ వారికి మరో సలహా ఇచ్చారు.
నిత్యం ఏదో ఒక సంచలన అంశంపై ట్వీట్లు పెట్టే వైసీపీ నేత పీవీపీ ఇప్పుడు మద్యాన్ని ఇలా ప్రమోట్ చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications