ఏపీ ఫలితాలపై అమిత్ షా జోస్యం వెనుక ? సజ్జల షాకింగ్ కామెంట్స్..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో ఇది ఎవరికి అనుకూలంగా ఉండొచ్చన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈసారి ఏపీలో గెలిచేది ఎవరో చెప్పేశారు. అమిత్ షా వ్యాఖ్యల తర్వాత ఏపీలో ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. అయినా రాజకీయ పార్టీలు ఎవరికి వారే తమ లెక్కలకే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇవాళ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
ఫలితాలు వచ్చే ముందు తాత్కాలిక ఆనందాలకు తాము వెళ్లడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. బెట్టింగ్ ల కోసం,సోషల్ మీడియా లో ప్రచారం కోసం ప్రయత్నాలు చేయడం లేదన్నారు. నార్త్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సౌత్ లో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చన్నారు.

ఉద్యోగులంతా తమ వెనుకే ఉన్నారని పోస్టల్ బ్యాలెట్ కు లేనిపోని నిబంధనలు అంటగడుతున్నారని సజ్జల మండిపడ్డారు.పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. బీజేపీ తో చంద్రబాబు పొత్తు తర్వాత బాబుకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదన్నారు.ఈవీఎం ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పడం లేదన్నారు. మిగతా చోట్ల ఈవీఎం ధ్వంసం వీడియో లు ఎందుకు బయట పెట్టలేదని సజ్జల ప్రశ్నించారు.
అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్ అడిగామని, టీడీపీ ఎందుకు రీ పోలింగ్ అడగలేదని సజ్జల ప్రశ్నించారు. మా కార్యకర్తలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ బాబు వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిందన్నారు. బాధితులకు పార్టీ తరపున అండగా నిలుస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆదుకుంటామన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నట్లుందన్నారు.
సీఎస్ ను తప్పించాలనే టార్గెట్ తో రెండు నెలలుగా ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలపై సజ్జల మండిపడ్డారు. ఉగ్రవాది లాగా సిఎస్ పై దాడి చేస్తున్నారన్నారు. భయపెట్టి కాళ్ళ బేరానికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. పదిరోజుల్లో వందల ఎకరాలు తీసుకోవడం సాధ్యమా అని ప్రశ్నించారు. కారణాలు లేకుండా సిఎస్ ను తప్పించాలని ఫిర్యాదు చేస్తున్నారన్నారు.
వారం తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడ అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications