'చంద్రబాబుది నవనిర్మాణ దీక్ష కాదని, నయవంచన దీక్ష'
అమరావతి: జూన్ 2వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు చేసేది నవనిర్మాణ దీక్ష కాదని, నయవంచన దీక్ష అని వైసీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న నవనిర్మాణ దీక్షపై నిప్పులు చెరిగారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం నయవంచన కాదా? అని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ విషయంలో ప్రజలను మోసం చేశారని, ఏ గ్రామంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజనకు అనుకూలంగా మొట్టమొదటి లేఖ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడేనని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ పోలిట్ బ్యూరోలో చంద్రబాబు ఏకగ్రీవ తీర్మానం చేయించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ పంపారని చెప్పారు. అప్పటి కేంద్రం హోం మంత్రి చిదంబరానికి కూడా లేఖ ఇచ్చారని అన్నారు.
రాష్ట్రాన్ని విభజించడంలో కీలకపాత్ర పోషించిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో సతమతమవుతుందని నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నిజానికి రాష్ట్ర విభజనను వ్యతిరేకించింది ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో వైసీపీ అధనేత వైయస్ జగన్ ఫ్లకార్డు పట్టుకుని విభజనను వ్యతిరేకించారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఓటు వేశారని తెలిపారు. ఇలా చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటని ఆయన దుయ్యబట్టారు.
విభజన చట్టంలోని ఆంశాలను కూడా తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ నేతలు కలిసి డ్రామాలు ఆడారని చెప్పిన తమ్మినేని ఏపీకి ప్రత్యేకహోదాపై ఆ నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు మాట్లాడకపోవడం దారుణమన్నారు.
చింతా కృష్ణమూర్తి మృతి: జగన్ పరామర్శ
అనారోగ్య కారణంతో వైసీపీ నేత చింతా కృష్ణమూర్తి బుధవారం మృతి చెందారు. ఆయన ప్రస్తుతం వైఎస్సార్సీపీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్నారు. దీంతో చింతా కృష్ణమూర్తి మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయను కటుంబసభ్యులకు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు.