YV Subba Reddy: టీటీడీ ఛైర్మన్గా వరుసగా రెండోసారి: బోర్డు సభ్యుల ఎంపికపై
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలక మండలి ఏర్పడింది. నిన్నటిదాకా కొనసాగిన స్పెసిఫైడ్ అథారిటీ రద్దయింది. ఆ అథారిటీ స్థానంలో పాలక మండలి ఏర్పాటైంది. టీటీడీ బోర్డు ఛైర్మన్గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం 9:45 నిమిషాలకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో బాధ్యతలను స్వీకరించారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

పాలక మండలి సభ్యుల ఎంపిక..
పాలక మండలి ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో స్పెసిఫైడ్ అథారిటీకి రద్దయినట్టే. ఇక- బోర్డు సభ్యులను ప్రభుత్వం ఇంకా నియమించాల్సి ఉంది. టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలను స్వీకరించడం వరుసగా ఇది రెండోసారి. ఛైర్మన్ పదవి కాల పరిమితి రెండేళ్లు ఉంటుంది. ఇదివరకు కూడా ఆయనే ఈ ప్రతిష్ఠాత్మక పాలక మండలికి ఛైర్మన్గా పని చేశారు. పదవీ కాలం ముగియడంతో పాలక మండలి ఆటోమేటిక్గా రద్దయింది. అప్పటికప్పుడు బోర్డును పునరుద్ధరించలేదు ప్రభుత్వం. దీనితో కొంతకాలం పాలక మండలి అధికారుల చేతుల్లోకి వెళ్లింది. దాని స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పడింది.

వైసీపీ నేతలు..
తాజాగా- వైవీ సుబ్బారెడ్డినే రెండెసారి కూడా ఛైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఈ ఆదివారం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్వర్వులు వెలువడిన మూడోరోజు ఆయన బాధ్యతలను స్వీకరించారు. కొత్త పాలక మండలి సభ్యులను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలను స్వీకరించే సమయంలో ఆయన వెంట భార్య స్వర్ణలత, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తిరుపతి లోక్సభ సభ్యుడు డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి (తిరుపతి), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (చంద్రగిరి), బియ్యపు మధుసూదన్ రెడ్డి (శ్రీకాళహస్తి), టీటీడీ ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.

కాలినడకన కొండకు..
ప్రమాణ స్వీకారం అనంతరం వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేయడానికి- అంతకుముందు రోజే వైవీ సుబ్బారెడ్డి అలిపిరి మార్గం మీదుగా తిరుమలకు కాలినడకన చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి మెట్ల మార్గం మీదుగా తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహంలో బస చేశారు.

మేకపాటి పేరు వినిపించినా..
వైవీ సుబ్బారెడ్డి స్థానంలో మరొకరిని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా నియమిస్తారంటూ మొదట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం సాగింది. ఆయన స్థానంలో నెల్లూరు లోక్సభ మాజీ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం విస్తృతంగా సాగింది. అదే సమయంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేరు కూడా తెరమీదికి వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి ఇదివరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ సారి టీటీడీ ఛైర్మన్గా పనిచేశారు. అవేవీ వాస్తవ రూపం దాల్చలేదు. మరోసారి వైవీ సుబ్బారెడ్డినే టీటీడీ పాలక మండలి ఛైర్మన్గా నియమించారు వైఎస్ జగన్.












Click it and Unblock the Notifications