కోడెలతో కుమ్మక్కై.. ఓట్ల గల్లంతుకు కుట్ర?: వైసీపీ, ఎన్నికల అధికారికి ఫిర్యాదు
విజయవాడ: ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ఏపీలో అప్పుడే రాజకీయ ఎత్తుగడలు మొదలైపోయాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ.. రెండూ రాజకీయ సమీకరణాల్లో తలమునకలైపోయాయి. ఇలాంటి తరుణంలో తమను దెబ్బ కొట్టేందుకు టీడీపీ కుయుక్తులు పన్నుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
15వేల ఓట్లు గల్లంతు
ఏపీలోని పలు పట్టణాల్లో ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగించేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సత్తెనపల్లిలోనే పదిహేను వేలమంది ఓటర్లను తొలగించేశారని, ఆ ఓట్లన్నీ వైసీపీ నేతలవేనని, నరసరావుపేటలోనూ భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
ఎన్నికల అధికారికి ఫిర్యాదు
ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియాకు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రావి వెంకటరమణ ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపులో టీడీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు.
కోడెలతో కుమ్మక్కై
కొంతమంది అధికారులు టీడీపీ నేత కోడెల శివప్రసాదరావుతో కుమ్మక్కై ఈ ఓట్ల తొలగింపును చేపట్టారని, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటును మరో వార్డుకు మార్చారని వైసీపీ నేతలు ఆరోపించారు. అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలిచేందుకే ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
విచారణ చేపట్టకపోతే పోరాటమే..
అధికారులు సైతం ఎలాంటి విచారణ లేకుండానే భారీ సంఖ్యలో ఓట్లను తొలగించడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలాగే ఓట్ల తొలగింపు జరుగుతుందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ విచారణ చేపట్టకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.