మా సమస్యలు పట్టించుకోరా - ఎమ్మెల్యేలకు ప్రశ్నలతో : అవాక్కైన మాజీ మంత్రి అవంతి..!!
వైసీపీ నేతల సమర్ధతకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పరీక్షగా మారుతోంది. ప్రభుత్వ పథకాలను వివరించటంతో పాటుగా.. వారితో మమేకం అయ్యేందుకు ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సమస్యలు - ప్రశ్నలతో స్థానికులు స్వాగతం పలుకుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలు అమలు...లబ్ది దారుల నుంచి వాటి పైన అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కానీ, కొందరికి మాత్రం సమస్యలు తప్పటం లేదు.
ప్రజలు సమస్యలు ప్రస్తావించినా..వారికి సమాధానం చెప్పాల్సిందేనని తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం తరువాత కూడా సీఎం జగన్ తన కేబినెట్ సహచరులకు స్పష్టం చేసారు. ఇక, రెండో రోజు సైతం పలు ప్రాంతాల్లో స్థానికుల నుంచి సమస్యలు..నిలదీతలతో ఎమ్మెల్యేలకు ముందుకెళ్లారు.
మాజీ మంత్రి అవంతి సమక్షంలోనే
పథకాలు తమకు అందడం లేదంటూ పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. మాజీ మంత్రి అవంతి విశాఖ జిల్లా ఆనందపురం మండలం పాలెం పంచాయతీలో జరిగిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలువలు సక్రమంగా లేవనే విషయాన్ని మహిళలు లేవనెత్తారు. అవంతి పథకాల గురించి వివరించే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో మహిళలు అవంతిని నిలదీసారు.
తాము ఓట్లు వేసి గెలిపించామని.. తమ సమస్యలు ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. తాగునీటి పథకం పనిచేయడం లేదని, ఫ్లోరైడ్ వ్యాధితో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరమూ ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామంలో మురుగునీరు అంతా తమ ఇంటి ముంగిటే ఉంటోందని.. కాలువ వేయడానికి కూడా పంచాయతీలో నిధులు లేవని అధికారులు అంటున్నారని పలువురు మండిపడ్డారు.
పథకాల పై నేతలు.. సమస్యలపై స్థానికులు
స్థానికులు లేవనెత్తిన అంశాలపై వాలంటీర్ చెప్పిన సమాధానంతో..వారు అవంతి సమక్షంలోనే వాలంటీర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే సమక్షంలోనే వాగ్వివాదం చోటుచేసుకోగా.. అవంతి వారిని సముదాయించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన మాజీ మంత్రి వెలంపల్లికి పశ్చిమ విజయవాడలో వాలంటీర్లే తమ కష్టాలను వివరించారు.
సుళ్లూరుపేటలోనూ స్థానిక ఎమ్మెల్యేను మహిళలు పలు సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేసారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరులో గురువారం పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావును సమస్యలపై స్థానికులు నిలదీశారు. రెండేళ్ల క్రితం అప్పు తెచ్చి రూ.5 లక్షలతో శస్త్ర చికిత్స చేయించుకున్నానని, సీఎం సహాయనిధికి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరిస్తున్నారని ఎమ్మెల్యేతో మొర పెట్టుకున్నారు.
సొంత పార్టీ వారికీ న్యాయం చేయటం లేదంటూ
సొంత పార్టీ వారికే న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు సరిగా లేవని, తాగునీరు రావడం లేదని, ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పిట్టలసరియాలో పాల్గొన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు సమస్యల సెగ తగిలింది. సొంత పార్టీ పార్టీవారు కట్టుకున్న ఇళ్లకూ బిల్లులు రాలేదని, తమకు ఇబ్బందిగా ఉందన్నారు.
జలుమూరు మండలం తిలారు ఆర్ఎస్, యాళ్లపేటలకు నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వెళ్లగా తమకు ఇళ్లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు రాలేదంటూ సమస్యలు ఏకరువు పెట్టారు. వీటికి సమాధానాలు చెప్పటం..సమస్యలు పరిష్కరించటం..అటు సమస్యలు ఏమున్నా..వాటిని వినాల్సిందే.. పరిష్కరించాల్సిందేననే సీఎం ఆదేశాలతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు ఉక్కపోత తప్పటం లేదు.