'జగన్ కాక మరెవరు, లోకేష్ బికినీ సంస్కృతిలో పెరిగాడని, మాతో కలవండి'
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తమ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కాకుండా మరెవరైనా మాట్లాడేందుకు ఉన్నారా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ సోమవారం నాడు టిడిపిని ప్రశ్నించారు.
విశాఖలో జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో జగన్కు వచ్చిన ప్రజాధరణ చూసి ఓర్వలేక టిడిపి విమర్శలు చేస్తోందన్నారు. అయిదు కోట్ల మంది ఏపీ ప్రజలు జగన్ ప్రసంగాన్ని అభినందిస్తుంటే, టిడిపి నేతలు మాత్రం విమర్శిస్తున్నారన్నారు. హోదాపై జగన్ కాకుంటే మరెవరు మాట్లాడుతారన్నారు.
ఇప్పటికైనా టిడిపి నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కేసుల నుంచి విముక్తి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద మోకరిల్లారని ఆరోపించారు. బికినీ సంస్కృతిలో నారా లోకేష్ పెరిగాడని, అలాగని బికినీ ఫెస్టివెల్ నిర్వహిస్తారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైసిపి నేత, మాజీ మంత్రి పార్థసారథి అన్నారు. ప్రత్యేక హోదా పైన మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.
జై ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావడాన్ని టిడిపి తట్టుకోలేకపోతోందన్నారు. టిడిపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే హోదా ఉద్యమానికి తమతో కలిసి రావాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీల కోసం హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు, రాష్ట్ర ప్రజలను పదేపదే మోసం చేస్తున్నారన్నారు.