బాబు పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ 'పోరుబాట'
హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనను ఎండగట్టేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరుబాట పట్టింది.
చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు.
ఈ ధర్నాల్లో రైతులు, డ్వాక్రా మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్యెల్యే కోనా రఘుపతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేపల్లెలోని స్ధానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, జలీల్ ఖాన్ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గౌతం రెడ్డి, వంగవీటి రాధాతోపాటు డ్వాక్రా మహిళలు, రైతులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ నగర పాలక సంస్ధ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా స్ధానిక గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేకా శేషుబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నర్సాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నేత కొత్తపల్లి జానకీ రామ్ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.