వైసీపీనేతల వరుసహత్యలు: నారాయణరెడ్డి హత్యఅందుకేనా ?,అక్కడినుండి వెళ్ళగానే..
కర్నూల్ జిల్లాలో వరుసగా హత్యలు జరగడం సంచలనం సృష్టిస్తోంది. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో రెండు వారాల క్రితం జంట హత్యలయ్యాయి. ఇవాళ కూడ ఇద్దరు హత్యకు గురికావడం సంచలనంగా మారింది.హత్యలకు గురైంది వైసీపీ నేతలే కావ
కర్నూల్: కర్నూల్ జిల్లాలో వరుసగా హత్యలు జరగడం సంచలనం సృష్టిస్తోంది. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో రెండు వారాల క్రితం జంట హత్యలయ్యాయి. ఇవాళ కూడ ఇద్దరు హత్యకు గురికావడం సంచలనంగా మారింది.హత్యలకు గురైంది వైసీపీ నేతలే కావడం గమనార్హం.పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకు కెఈ సోదరులే కారణమని నారాయణరెడ్డి భార్య శ్రీదేవి, సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు.
కేఈ కుటుంబసభ్యులపై నారాయణరెడ్డి కుటుంబసభ్యులు ఆరోపణలు గుప్పించారు.పోలీసులు కూడ కేఈ కుటుంబానికి సహకరించారని వారు ఆరోపణలు చేస్తున్నారు. పత్తికొండలో కేఈ కృష్ణమూర్తి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నారాయణరెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారని తెలిపారు.
ఆదివారం ఉదయం పూట నారాయణరెడ్డిని ప్రత్యర్ధులు హత్య చేశారు. నారాయణరెడ్డి హత్య విషయం తెలుసుకొన్న వైసీపీ చీఫ్ జగన్ కర్నూల్ జిల్లాకు బయలుదేరి వెళ్ళారు.మరో వైపు వరుసగా కర్నూల్ జిల్లాలో వైసీపీ నేతలు హత్యకు గురికావడం పట్ల ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టిడిపి నాయకులు పథకం ప్రకారంగానే నారాయణరెడ్డిని హత్య చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఎంతటివారైనా అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ రవికృష్ణ ప్రకటించారు.
ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందుకే
ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందుకే నారాయణరెడ్డిని హత్య చేశారని నారాయణరెడ్డి కుటుంబసభ్యులు ఆరోపించారు. డిప్యూటీ సీఎం కెఈ కుటుంబసభ్యులు ఇసుక మాఫియాకు నాయకత్వం వహిస్తున్నాడని నారాయణరెడ్డి భార్య, సోదరుడు ప్రదీప్ రెడ్డిలు ఆరోపించారు. పోలీసులు కూడ ఈ విషయంలో సహకరించారని వారు ఆరోపించారు.తమ కుటుంబంపై ఎంతకాలంపాటు కక్షసాధిస్తారని నారాయణరెడ్డి భార్య శ్రీదేవి ప్రశ్నించారు. హత్య రాజకీయాలను ఆమె ఖండించారు. తన పిల్లలకు తండ్రి లేకుండా చేశారని ఆమె కన్నీళ్ళ పర్యంతమయ్యారు. తన భర్త ఏ లక్ష్యం కోసం పోరాటం చేశారో , ఆ పోరాటాన్ని కొనసాగించనున్నట్టు ఆమె చెప్పారు.
హత్యకు ముందు పెళ్ళిలో సంతోషంగా
పత్తికొండ వైఎస్ఆర్ సీపీ ఇంచార్జ్ నారాయణరెడ్డి హత్యకు ముందు వెల్దుర్తిలో పెళ్ళికి హాజరై తిరిగివస్తుండగా హత్యకు గురయ్యారు. వెల్దుర్తిలోని లిమ్రా ఫంక్షన్ హాల్ లో పెళ్ళికి హజరై నూతన వధూవరులను నారాయణరెడ్డి ఆశీర్వదించారు. నూతన వధూవరులతో కలిసి ఫోటోలు దిగారు.తన మద్దతుదారులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడారు.పెళ్ళి మండపం నుండి వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఆయన హత్యకు గురైన విషయం తెలిసిన వారు దిగ్బ్రాంతికి గురయ్యారు.
పాతకక్షలా ఇతర కారణాల అనే కోణంలో దర్యాప్తు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్ జిల్లాకు చెందిన టిడిపి నేత కప్పట్రాళ్ళ వెంకటప్పనాయుడు హత్య కేసులో చెరుకులపాడు నారాయణరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.అయితే ఆయన నిర్ధోషిగా బయటపడ్డాడు. అయితే నారాయణరెడ్డి హత్యకు ఫ్యాక్షన్ హత్యలే కారణమా, ఇంకా రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన విషయం తెలిసిన వెంటనే కర్నూల్ జిల్లా ఎస్పీ రవికృష్ణ సంఘటనస్థలాన్ని పరిశీలించారు.
కర్నూల్ లో వరుసహత్యలు
కర్నూల్ జిల్లాలో వరుసగా హత్యలు చోటుచేసుకొంటున్నాయి. ఇటీవల కాలంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మద్దతుదారులు ఇద్దరు ఇటీవలే హత్యకు గురయ్యారు. ఈ హత్యలకు గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.అయితే ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఈ జంట హత్యలతో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోలేదని పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.అయితే ఈ జంట హత్యలకు కారకులను వదిలే ప్రసక్తేలేదని గంగుల హెచ్చరించారు.తాజాగా పత్తికొండ వైసీపీ ఇంచార్జీ నారాయణరెడ్డి హత్యకు గురికావడం పట్ల కూడ ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.