వైసీపీ మద్దతు బీజేపీ కోరలేదు : ఫొటోలతో జగన్ పార్టీ మైండ్ గేమ్ - కమలం నేతల సంచలనం..!!
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ముఖ్య నేతలు వైసీపీ మద్దతు కోరలేదా. వైసీపీనే ముందకొచ్చి మద్దతు ప్రకటించిందా. ఫొటోల కోసమే బీజేపీ నేతలతో కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారా. వైసీపీ పైన బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాష్ట్రపతి ఎన్నికల పైన చర్చ ప్రారంభం సమయంలో కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యుల ఆహ్వానం మేరకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధానితో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సమావేశమయ్యారు. ఆ సమయంలోనే రాష్ట్రపతి ఎన్నికల పైన చర్చకు వచ్చిందని.. జగన్ మద్దతు పై హామీ ఇచ్చారనే ప్రచారం సాగింది.
బీజేపీ నేతల కీలక వ్యాఖ్యలు
కానీ..ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ జాతీయ నాయకత్వం మద్దతు కోరలేదని చెప్పుకొచ్చారు. ఏ రకంగా చూసినా వైసీపీ తమకు అంటరానిదేనంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రుల వెనుక ఎక్కడో నిల్చొని ఫొటోల్లో కనిపిస్తూ తాము బీజేపీతో కలిసే ఉన్నామనే భ్రమను ప్రజల్లో కల్పించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలది మైండ్ గేమ్ గా అభివర్ణించారు. వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రానికి మద్దతిచ్చి..ఆ తరువాత వైసీపీ భారత్ బంద్ కు మద్దతు తెలిపిందని ఆక్షేపించారు.
వైసీపీ అంటరానిదే అంటూ
వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ చేసిన ప్రసంగాన్ని తప్పు బట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు 60 నుంచి 90 శాతం నిధులు కేంద్రం నుంచి ఇస్తున్నా ఆ విషయం చెప్పలేదన్నారు. సీఎం సతీమణి ఒక మీడియా సంస్థలకు అధిపతిగా ఉండగా.. ఆ పార్టీ ప్లీనరీలో మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకోవటం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ - వైసీపీ మధ్య ఎలాంటి సమోధ్య లేదని స్పష్టం చేసారు. అటువంటి అభిప్రాయం ఎక్కడైనా ఉంటే దానిని పోగొట్టాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు నుంచి కేంద్ర మంత్రుల వరకు ప్రతీ ఒక్కరూ వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని చెప్పుకొచ్చారు.
వైసీపీ నేతలు స్పందిస్తారా
కేంద్రం బియ్యం ఇవ్వటం లేదంటూ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని ..దీని పైన 14న అన్ని జిల్లా కేంద్రాల్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలో నిలిచిన ఎన్డీఏ అభ్యర్ధి ముర్ము రేపు (మంగళవారం) అమరావతికి వస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. వైసీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ముర్ముకు సీఎం జగన్ తన నివాసం లో తేనేటి విందు ఏర్పాటు చేసారు. అయితే, బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరలేదని చెప్పటంతో..ఇప్పుడు వైసీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి.