పోలవరంలో చంద్రబాబు లెక్క ఇలా తప్పింది ? అసలు కారణం చెప్పేసిన వైసీపీ మంత్రి ..!
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకుంటున్న లోపాలు, కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వంటి కారణాలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ఎన్నికల నాటికి పూర్తయ్యే పరిస్ధితులు కూడా కనిపించడం లేదు. అయితే వీటి వెనుక చంద్రబాబు పాలనలో తీసుకున్న నిర్ణయాలే ఉన్నాయని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు.
కాకినాడ జిల్లా తుని మండలం డి.పోలవరం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దాడిశెట్టి రాజా..పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని పూర్తి చేసి ఇస్తానని కేంద్రం గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా హామీ ఇచ్చిందని రాజా గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక రామోజీరావు, నవయుగ చౌదరికి లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబు మేం కట్టుకుంటామని తీసుకున్నారని విమర్శించారు.

చంద్రబాబు పాలనలో వర్షాలు పడవు, వరదలు రావని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. జగనన్న పరిపాలనలో మంచి పంటలు పండుతున్నాయని, సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయని గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో వరదలు రావనే నమ్మకంతో నాసిరకం మెటీరియల్ తో నిర్మాణం చేసాడని ఆయన ఆరోపించారు. అందుకే పోలవరం నిర్మాణాలు వరదల్లో కొట్టుకుపోయాయన్నారు. మళ్ళీ మొదటి నుంచి నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.
చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ని ఏటీఎం కార్డులా వాడుకున్నాడని మంత్రి దాడిశెట్టి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ లో చేసిన అవినీతి, అక్రమాలు ప్రజలకు కనబడకుండా జయము జయము చంద్రన్న అని పాటలు పాడించుకుని క్యాట్ వాక్ చేసేవాడని చంద్రబాబును మంత్రి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చంద్రబాబే కారణమని మంత్రి రాజా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications