Rk Roja : ఎగ్జిట్ పోల్ ఫలితాలపై రోజా హాట్ కామెంట్స్..!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై నిన్న ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. వీటిలో పలు ఎగ్జిట్ పోల్స్ అధికార వైసీపీవైపు మొగ్గగా.. మరికొన్ని మాత్రం కూటమికి జై కొట్టాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు వీటిపై స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి ఆర్కే రోజా కూడా ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. తిరుమల దర్శనానికి వచ్చిన రోజా.. ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా జగన్ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.
జూన్ 4న ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారని రోజా తెలిపారు. ఎవరికి కావాల్సిన స్టోరీలు వారు వండుతున్నారనేది గమనిస్తున్నామన్నారు. నిన్నే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని, ఎవరేం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడేం చర్చలు జరిగనా ఫైనల్ గా జరిగేది జగనన్న సీఎం అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారన్నారు. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా ఓటేసి వెళ్లారన్నారు.

స్వాతంత్రం వచ్చాక ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు అందించిన ఏకైక సీఎం జగన్ మాత్రమే అని రోజా తెలిపారు. రాష్ట్రం విడిపోయి నష్టాలు, కష్టాల్లో ఉన్నా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని చిత్తశుద్దితో పారదర్శక పాలన అందించారు కాబట్టే మేం గెలుపుపై నమ్మకంగా ఉన్నామన్నారు. కూటమి ఇప్పుడు కొత్తగా పెట్టుకుంది కాదు గతంలో కూడా పోటీ చేసారన్నారు.
2014లో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినా రెండుచోట్లా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, రాష్టానికేం చేయలేదని ప్రజలు గమనించారు కాబట్టి ఆ కూటమికి క్రేజ్ లేదని అందరికీ తెలుసన్నారు. వ్యవస్థలు చంద్రబాబు చేతుల్లో ఉండి ఇష్టారాజ్యంగా ఎలా పనిచేస్తున్నాయో అంతా చూస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త కొత్త రూల్స్ తో పోస్టల్ బ్యాలెట్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారన్నారు. ఎవరేం చేసినా ప్రజల మనసుల్లో ఉన్న జగన్ ను చంద్రబాబే కాదు ఆయన్ను పుట్టించిన ఖర్జూరనాయుడు కూడా మార్చలేరన్నారు.












Click it and Unblock the Notifications