'కిమ్ జోంగ్'లా నియంత అనుకుంటున్నారా.. ఎస్ఈసీపై అంబటి ఫైర్... గంటా రాజీనామా బూటకమంటూ...
ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 వరకూ హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలను వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తప్పు పట్టారు. హౌస్ అరెస్టేనా.. కనీసం కాలకృత్యాలైనా తీర్చుకోనిస్తారా లేదా అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని ఇలా కట్టడి చేసే హక్కు ఎవరికి లేదని అన్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి బలమైన రాజకీయ నేతగా ఉన్నారని... చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నందునే నిమ్మగడ్డ ఆయనపై కక్ష గట్టారని ఆరోపించారు.
మీరు కిమ్ జోంగ్ కాదు...: అంబటి
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్దంగా,సక్రమంగా ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని ఎన్నికల కమిషన్కు ఇచ్చిందని... అంతే తప్ప పక్షపాత ధోరణితో ఇతరుల మానవ హక్కులను కాలరాస్తే అది రాజ్యాంగ భక్షణ అవుతుందని పేర్కొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్లా నియంత కాదని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయనో అధికారి మాత్రమేనని.. చట్టానికి లోబడే పనిచేయాలని హితవు పలికారు. గీత దాటితే ఆయనకు రాజ్యాంగ రక్షణ ఉండదని హెచ్చరించారు. రాజ్యాంగం ముసుగులో సభా హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు.
మూల్యం చెల్లించక తప్పదు : అంబటి
పెద్దిరెడ్డి ఏం దౌర్జన్యం చేశారని ఆయన్ను హౌస్ అరెస్ట్ చేయమన్నారని నిమ్మగడ్డను అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తప్పులను ఖండించే బాధ్యత ప్రజలకు ఉంటుందని అన్నారు. నిమ్మగడ్డ విపరీత ధోరణికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. నిమ్మగడ్డ ఆదేశాలను న్యాయస్థానాల్లో సవాల్ చేస్తామన్నారు. అధికారులు ఎవరైనా అక్రమంగా పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకుంటే వారిని బ్లాక్ లిస్టులో పెట్టడం తప్పదన్నారు.గతంలోనూ చాలాచోట్ల ఏకగ్రీవాలు జరిగాయని.. నిమ్మగడ్డ మాత్రం ఏకగ్రీవాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.
గంటా బూటకపు రాజీనామా..?
ఇక విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై స్పందిస్తూ... దానిపై ఇంకా నోటిఫికేషన్ కూడా రాకముందే హడావుడి మొదలుపెట్టారని విమర్శించారు. గంటా శ్రీనివాస రావు రాజీనామాను ప్రస్తావిస్తూ.. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది... ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని ఎద్దేవా చేశారు. బూటకపు రాజీనామాలు,బూటకపు దీక్షలను ప్రజలు నమ్మవద్దని అన్నారు. సరైన సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందిస్తారని... గంటా శ్రీనివాసరావు కన్నా,చంద్రబాబు కన్నా ఏపీ ప్రజలపై వైసీపీకే బాధ్యత ఉందని అన్నారు. ప్రజల కోసం తాము నిలబడుతామని స్పష్టం చేశారు.