'పవన్కు అంత అవసరం ఏమొచ్చింది.., కుక్క తోకతో గోదారి ఈదినట్టే..'
బేషరతుగా బీజేపీతో చేతులు కలపాల్సిన అవసరం ఏమొచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ను వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. బీజేపీ,జనసేనలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. గత ఎన్నికల్లో వాటి ప్రభావమెంతో అందరికీ తెలిసిపోయిందని అన్నారు. పవన్ ఒక్కో లైబ్రరీలో కూర్చొని.. ఒక్కో పుస్తకం చదువుతూ ఒక్కోలా ప్రభావితం అవుతారని ఎద్దేవా చేశారు. రాజకీయ స్థిరత్వం లేని పవన్ కల్యాణ్.. ఒక్క పార్టీతోనైనా దీర్ఘ కాలం పనిచేశారా? అన్నది ఆలోచించుకోవాలన్నారు. తాడేపల్లిగూడెంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడారు.
అప్పుడు పాచిపోయిన లడ్డూలు.. మరి ఇప్పుడు..
గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డులు ఇచ్చిందని విమర్శించిన పవన్కు.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు వాటిల్లో కిస్మిస్ వేసి ఫ్రెష్ లడ్డులు ఏమైనా పంపించారా అని ప్రశ్నించారు. పవన్ ఏ పార్టీ కార్యాలయంలో కూర్చుంటే.. ఆ పార్టీకి మద్దతునిస్తారని,ఆయన్ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని విమర్శించారు. 2014లో టీడీపీ,బీజేపీ, 2019లో వామపక్షాలు,బీఎస్పీ.. ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తుకు సిద్దమవడం.. స్థిరత్వం లేని పవన్ రాజకీయాలకు నిదర్శనం అన్నారు.
వైసీపీకి నష్టమేమీ లేదు..
ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని అంబటి అన్నారు. రాష్ట్రానికి బీజేపీతోనే న్యాయం జరుగుతుందని నమ్ముతున్న పవన్.. ప్రత్యేక హోదాపై మాత్రం వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమేంటని అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే రాజకీయ కూటమి ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. రాజకీయంగా,వ్యక్తిగతంగా పవన్కు స్థిరత్వం లేదని.. నాలుగున్నరేళ్లు ఒకే పార్టీతో ఆయన కొనసాగగలరా? అని ప్రశ్నించారు.
ఏడు నెలల్లో డిసైడ్ చేస్తారా..
ఏ ప్రభుత్వం విఫలమైందని ఏడు నెలల్లోనే ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. బీజేపీ,జనసేనలు రాష్ట్రంలో పెద్దగా గుర్తింపు లేని పార్టీలని, గత ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చిన సీట్లు అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. సీట్ల విషయంలో తామెప్పుడూ కూడికలు,తీసివేతలతో రాజకీయాలు చేయలేదని, ఒంటిచేత్తో 151 సీట్లు గెలిచామని స్పష్టం చేశారు.
చంద్రబాబును కాపాడేందుకే
ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు సాయం చేసేందుకే పొత్తు పెట్టుకున్నారా అని అంబటి నిలదీశారు. చంద్రబాబును కాపాడే ఉద్దేశంతోనే పవన్ రాజకీయాలు చేస్తున్నారని.. జనసేన చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ అని,ఆయన చేతే నడిపించబడుతున్న పార్టీ అని విమర్శించారు. సిద్దాంతాలు,స్థిరత్వం లేని పవన్ కల్యాణ్కు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదన్నారు. ఎవరెన్ని కూటములు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, వైసీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు.