చెవిరెడ్డికి షాకిచ్చిన పోలీసులు: బెయిల్పై విడుదలైన వెంటనే మళ్లీ అరెస్ట్
అమరావతి: చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం హైడ్రామా చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. జిల్లాలోని వడమాలపేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో శుక్రవారం అరెస్టైన ఆయన శనివారం ఉదయం బెయిల్పై విడుదలయ్యారు.
అయితే తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే చెవిరెడ్డిపై మరో కేసు నమోదు అయిందంటూ ఆయన సబ్ జైలు నుంచి వెలుపలికి రాకముందే గేటు బయట అప్పటికే సిద్ధంగా ఉన్నఎంఆర్ పల్లి పోలీసులు వెంటనే ఆయనను మరోమారు అరెస్ట్ చేసి షాక్ ఇచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చెవిరెడ్డి అనుచరులు అక్కడ ఆందోళనకు దిగారు.
దీంతో జైలు గేటు బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎంఆర్ పల్లి పోలీసులు మాత్రం ఆయనను బలవంతంగా అక్కడ నుంచి లాక్కెళ్లారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన అనుచరులతో రాత్రివేళ సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో సెక్షన్ 147, 341, 448 కేసులను ఎంఆర్ పల్లి పోలీసులు నమోదు చేశారు.
కాగా 2013లో రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఎన్నికల నియామావళి ఉల్లంఘనగా పరిగణించి అప్పట్లో పోలీసులు చెవిరెడ్డిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన్ను గురువారం చెవిరెడ్డిని అరెస్ట్ చేసి వడమాలపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
శుక్రవారం ఆయన్ను పుత్తూరు కోర్టులో హాజరు పరచగా, 15 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. వెంటనే చెవిరెడ్డి తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, పుత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పటికే సమయం మించిపోవటంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి శనివారం ఉదయం జైలు నుంచి విడుదలైన ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
దీంతో ఆయన్ను చిత్తూరు జిల్లా పరిధిలోని జైళ్లలో అయితే చెవిరెడ్డికి అభిమానులు పోటెత్తుతారని భావించి పొరుగునే ఉన్న కడపలోని సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులో అరెస్టైన చెవిరెడ్డిని శనివారం మధ్యాహ్నానికి కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.
కేసులకు భయపడేది లేదు
మరోవైపు తనపై వరుసగా నమోదవుతున్న కేసులపై వైసీపీ కీలక నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కపడ జైలుకు తరలించే క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు.
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. గడపగడపకూ వైసీపీ కార్యక్రమంలో చంద్రబాబు సర్కారు పాల్పడుతున్న దుర్మార్గాలను ప్రజలకు వివరించాను కాబట్టే తనను అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.