పవన్ మాయలో కాపు యువత డబ్బు గుల్ల.. జనసేనానిపై జక్కంపూడి రాజా ఫైర్..
''కాపులకు రిజర్వేషన్ అంశం నుంచి దృష్టిని మళ్లించడానికే జగన్ రెడ్డి తెలివిగా 'వైఎస్సార్ కాపు నేస్తం' పథకాన్ని తీసుకొచ్చారు. 'గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం' అన్నరీతిలో ఏ పథకం కింద లబ్ది చేకూరినా అది కాపులను ప్రత్యేకంగా ఉద్ధరించడానికి పెట్టిందేనని వైసీపీ గొప్పలు చెబుతోంది..''అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ కు అధికార వైసీపీ ఘాటుగా కౌంటరిచ్చింది.

కాపు యువత అలా..
ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. పవన్ డ్యాన్సులు, డైలాగులల మాయలో పడిన కాపు యువత.. ఆయన సినిమాలకు తమ సొంత డబ్బు ఖర్చు చేసి కార్యక్రమాలు నిర్వహించారని, అయితే పవన్ మాత్రం కాపులకు అండగా ఉండాల్సిందిపోయి, చంద్రబాబును భుజాలపై మోస్తున్నారని రాజా మండిపడ్డారు.

ఐదేళ్లలో ఏం ప్రశ్నించావ్?
‘‘ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ చెప్పుకున్నారు. గత టీడీపీ పాలనతో ఐదేళ్లకూ కలిపి కాపులకు కేవలం రూ.1600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కాపు రిజర్వేషన్లు అడిగిన పాపానికి ముద్రగడ పద్మనాభంతోపాటు వేల మందిపై కేసులు బనాయించారు. గడిచిన ఐదేళ్లలో పవన్ ఏం ప్రశ్నించారు? అదే ఇవాళ జగన్ సర్కారు కాపుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తుంటే అవాకులు, చెవాకులు ఎందుకు పేలుతున్నారు? 2019 ఎన్నికల్లో పవన్ పోటీచేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. కనీసం కాపులు కూడా ఆయనను విశ్వసించడంలేదన్న సంగతిని పవన్ ఇప్పటికైనా గుర్తించకపోతే ఎలా?'' అని జక్కంపూడి ప్రశ్నించారు.

ఇవన్నీ కనిపించడం లేదా?
కాపుల అభ్యున్నతి విషయంలో సీఎం జగన్ కమిట్మెంట్ ను ఎవరూ కాదనలేరని, పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అనేక రకాలుగా కాపులకు చేయూత ఇస్తున్నారని ఎమ్మెల్యే రాజా చెప్పారు. ప్రభుత్వం ఇటీవలే ‘వైఎస్సార్ కాపు నేస్తం' పేరుతో అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేసే పథకాన్ని ప్రారంభించారని, దీని ద్వారా ఏటా 2.36 లక్షల మహిళలకు లబ్ధి చేకూరుతుందని, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ పథకం వస్తిస్తుందని వర్తిస్తుందని ఆయన గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న పనులేవీ పవన్ కు కనిపించడం లేదా? చంద్రబాబుకు అనుకూలంగా జగన్ పై విమర్శలు చేయడమే జనసేనాని పనా? అని జక్కంపూడి మండిపడ్డారు.

చంద్రబాబు ట్రాప్లో పవన్..
మొదటి నుంచీ కాపులను నిలువునా మోసం చేస్తోన్న చంద్రబాబును కాకుండా, ఆ కులస్తులకు మేలు చేస్తోన్ సీఎం జగన్ ను పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తుండటం బాధాకరమని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు ట్రాప్ లో పడిపోయి పవన్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ‘‘కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటు ఆయన కుటుంబాన్ని చంద్రబాబు చిత్రహిసలు పెట్టిననాడు పవన్ ఒక్కమాటైనా అనలేదు. టీడీపీ హయాంలో వేల మంది కాపు యువతపై కేసులు పెట్టినప్పుడూ ప్రశ్నించలేదు. వంగవీటి రంగాని హత్య చేయించిన పార్టీతో పవన్ చేతులు కలిపాడు. కాపులకు అన్యాం చేశారు కాబట్టే టీడీపీ, దానికి సహకరించిన జనసేనకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు''అని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications