దోపిడీకి లోకేష్ డైరెక్షన్, బాబు యాక్షన్: సీఎం రమేష్నీ లాగిన వైసిపి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గురువారం నాడు ధ్వజమెత్తారు. చినబాబు నారా లోకేష్ డైరెక్షన్లో చంద్రబాబు యాక్షన్లో దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రూ.11వేల కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులను రూ.24వేల కోట్లకు ఎందుకు పెంచారని ఆయన ప్రశ్నించారు. గాలేరు - నగరి ప్యాకేజీలో తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్కు రూ.12 కోట్ల రూపాయల పనులను రూ.115 కోట్ల రూపాయలకు ఎలా పెంచారని ప్రశ్నించారు.
జగన్ రాజద్రోహం: దేవినేని
వైసిపి అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాజద్రోహానికి పాల్పడుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూలదోస్తానని చెప్పడం రాజద్రోహం అన్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వంతో పిచ్చి ప్రేలాపనలు సరికాదన్నారు. కుట్రపూరిత చర్యలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు.
10మంది అరెస్టు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ముందస్తుగా పదిమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో రైలు భూసేకరణను కొందరు రైతులు వ్యతిరేకిస్తున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.