రాయపాటి కారులో వచ్చి.. బాబుతో వైసీపీ ఎమ్మెల్యే ప్రత్యేక భేటీ: ఏం జరిగింది?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా షేక్ శనివారం ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ నిర్ణయమే, తొందరవద్దు: బడ్జెట్పై చర్చలో చంద్రబాబు ఆవేదన
గుంటూరులోని ఒమేగా ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. కొద్దిసేపు చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
రాయపాటి కారులో వచ్చి..
కాగా, ముస్తాఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తన కారులో తీసుకువచ్చారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మద్దలి గిరిధరరావుపై ముస్తఫా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ముస్తఫా టీడీపీలో చేరుతారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. శనివారం సీఎంతో ముస్తాఫా భేటీ కావడం ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది.
Recommended Video
ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో చురుగ్గా
అయితే, టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ముస్తఫా చాలా చురుకుగా ఉండేవారు. ఇటీవల ఆర్టీయే అధికారులపై టీడీపీ నేతల ప్రవర్తనను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీవద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చెవిరెడ్డిని విడుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ముస్తాఫా అయితే ఏకంగా గేటు నిరసన తెలిపారు. అయితే, ఈ క్రమంలో టీడీపీ అధినేతను ప్రత్యేకంగా ముస్తఫా కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీలో చేరికపై ఏమైనా చర్చించారా? అనేది తెలియాల్సి ఉంది.
బాబుతో భేటీపై ముస్తఫా ఏమన్నారంటే..
ఇది ఇలా ఉంటే చంద్రబాబుతో తన భేటీపై ఎమ్మెల్యే ముస్తఫా స్పష్టతనిచ్చారు. తాను తన నియోజవకర్గ అభివృద్ధి కోసమే సీఎం చంద్రబాబును కలిశానని చెప్పారు. నియోజవకర్గ అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించాలని చంద్రబాబును కోరానని, అయితే, రూ.2కోట్లు ఇచ్చేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడను
తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే అవకాశం లేదని ముస్తఫా తేల్చి చెప్పారు. తన నియోజకవర్గానికి వచ్చినందునే మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలిశానని తెలిపారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ముస్తఫా స్పష్టం చేశారు.