ఏ సెంటర్ అయినా.. ఏ సీటు అయినా ఓకే: సింగిల్ హ్యాండ్తో మట్టి కరిపిస్తాం: రోజా సంబరం
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎదురులేని మెజారిటీని సొంతం చేసుకుంది. నియోజకవర్గంలో ఉన్న ఓట్లను క్వీన్స్వీప్ చేసింది. ఫ్యాన్ గాలి హోరు సునామీని తలపించింది. పాత రికార్డులు బదలయ్యాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఇదే బద్వేలు నియోజకవర్గంలో ఇదే వైఎస్సార్సీపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీకి రెట్టింపు ఓట్లు ఆ పార్టీకి పోల్ అయ్యాయి.

90 వేలకు పైగా మెజారిటీ..
ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థిని డాక్టర్ దాసరి సుధ.. కళ్లు చెదిరే మెజారిటీతో విజయదుందుభిని మోగించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్పై 90,590లకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. సుమారుగా రెండు లక్షలకు పైచిలుకు ఉండే ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఓట్లను సాధించడం అనేది తిరుగులేని రికార్డుగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచారం చేయనప్పటికీ.. ఆ పార్టీకి ఈ స్థాయిలో పట్టం కట్టారు బద్వేలు ఓటర్లు.

ఈ విజయంతో హర్షాతిరేకాల్లో వైసీపీ..
ఈ తిరుగులేని గెలుపు- వైసీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలను నింపింది. ఆకాశమే హద్దుగా విజయోత్సవాలను జరుపుకొంటున్నారు వైసీపీ నాయకులు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా అన్ని చోట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదికి వచ్చి, సంబరాలను నిర్వహిస్తున్నారు. పలు చోట్ల పార్టీ జెండాలను ఎగురవేశారు. బైక్లు, కార్లు, ఇతర వాహనాలకు ఈ జెండాలను కట్టి వేడుకలను జరుపుతున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇదే పరిస్థితి నెలకొంది.

ఏ సెంటర్ అయినా ఇదే రిజల్ట్..
బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిని డాక్టర్ దాసరి సుధ ఘన విజయాన్ని సాధించడం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘన విజయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తోన్న సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు. ఓటర్లు తమ ప్రభుత్వానికి పట్టం కట్టారని చెప్పారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో 45 వేల మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థిని ఓటర్లు గెలిపిస్తే..ఈ దఫా 90 వేల మెజారిటీ ఇచ్చారని అన్నారు.

పరిపాలనకు గీటురాయి..
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎన్నికలే గీటురాయి అని, భారీ మెజారిటీని ఇవ్వడం ద్వారా ఓటర్లు తమ అభిప్రాయాన్ని తెలియజేశారని రోజా చెప్పారు. వైఎస్ జగన్ పరిపాలనకు మార్కులు వేశారని అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు వాగుడు చూశామని, ఆయనను ప్రజలు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదని చెప్పారు. ఏ సెంటర్ అయినా, ఏ ఎన్నిక అయినా వైఎస్ జగన్ సింగిల్ హ్యాండ్తో మట్టి కరిపిస్తారని వ్యాఖ్యానించారు.

దొంగదెబ్బ తీయాలని చూశారు..
బద్వేలు ఉప ఎన్నికలో పోటీ నుంచి తప్పుకొన్నట్లు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. జనసేన-బీజేపీలకు మద్దతు ఇచ్చిందని, కాంగ్రెస్ను కూడా కూడగట్టుకుని తమను దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నించిందని రోజా అన్నారు. బద్వేలు ప్రజలు మాత్రం.. వారందరినీ చితకబాది, తరిమి కొట్టారని చెప్పారు. ఎమ్మెల్యే సీటు కాదు గదా..అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని బద్వేలు ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. వైఎస్ జగన్ జెండా, అజెండా వెంటే ప్రజలు ఉన్నారని మరోసారి స్పష్టమైందని రోజా చెప్పారు.












Click it and Unblock the Notifications