చంద్రబాబుకు మహిళల చేతిలో చీపురు దెబ్బలు తప్పవు: రోజా
అమరావతి: ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి, ఏపీ ప్రజలను మోసం చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి రెండేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్లు గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేసే రకాలని అన్నారు.
ఈ రెండు సంవత్సరాల చంద్రబాబు పాలన అదే గుర్తుకు తెస్తుందన్నారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నించినందుకే వైసీపీ అధినేత వైయస్ జగన్పై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారని అన్నారు. "ఏపీ సీఎం చంద్రబాబు పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రజా కంటక పాలన అని చెప్పవచ్చు. రెండు మాటల్లో చెప్పాలంటే, సంక్షోభం, దుర్భిక్షం అని చెప్పొచ్చు. మూడు మాటల్లో చెప్పాలంటే, అవినీతి, అరాచకం, అసమర్థత అని చెప్పొచ్చు. ఈ రోజు అవినీతి చూస్తే, చంద్రబాబు, లోకేశ్ల అవినీతి ఇస్రో ప్రయోగిస్తున్న రాకెట్ల కన్నా వేగంగా దూసుకుపోతోంది. తండ్రీ కొడుకులు బరితెగించి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో మనం కళ్లారా చూస్తున్నాం" అని ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు.
"చంద్రబాబు సంతకాలు పెడుతుంటే, మన లోకేశ్ బాబు సూట్ కేసులు సర్దేస్తున్నారు. చంద్రబాబు డీల్ చేసి కాంట్రాక్టులు ఇస్తుంటే, ఆయన కొడుకు కమీషన్లను సెటిల్ చేస్తున్నారు. కలెక్షన్ కింగ్ అంటే అందరికీ మోహన్ బాబు గుర్తుకు వస్తారు. కానీ ఏపీలో అవినీతి సొమ్మును కలెక్ట్ చేయడంలో కలెక్షన్ కింగ్ అంటే లోకేష్ బాబే అందరికీ గుర్తుకు వస్తున్నారు" అని విమర్శించారు.
చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ చంద్రబాబు, లోకేశ్ బాబు ఎక్కడ భూములు దొరికినా బినామీ బాబుల పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి అనకొండని, లోకేష్ బాబు కమీషన్ల కొండచిలువని అనకుండా ఉండలేకపోతున్నానని చెప్పారు. తనకున్నంత అనుభవం ఎవరికీ లేదని చెప్పుకునే ఆయనకు అవినీతిలో ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నారని ఎద్దేవా చేశారు.
అవినీతిలో చంద్రబాబుకు ఉన్నంత అనుభవం మరెవరికీ లేదన్నారు. మన దేశంలో మంత్రివర్గ సమావేశాలకు సీఎం కుమారుడు హాజరు కావడం ఒక్క ఏపీలోనే జరుగుతోందని అన్నారు. అది మన రాష్ట్రం దౌర్భాగ్యమని, ప్రతి మంత్రి వర్గ సమావేశంలో ఆయన పాల్గొంటున్నారని తెలిపారు.
రాష్ట్రంలో గొప్ప పరిపాలన అంటూ జూన్ 2 నుంచి 8 వరకు సంబరాలు చేసుకోవడం సిగ్గు చేటని ఆమె అన్నారు. చంద్రబాబు అత్తగారింటి మీద ప్రేమతో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య తిరుగుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ మాదిరే అభివృద్ధి అంతా ఒక్క చోటే జరుగుతుందని, అభివృద్ధి వికేంద్రీ కరణ జరగడం లేదని చివరకు ఇక్కడ నుంచి కూడా బయటకి నెట్టవేయబడతామని అన్నారు.
చంద్రబాబుకు ఓట్లు వేయలేదని రాయలసీమపై పగ తీర్చుకుంటున్నారని ఆరోపించారు. విజయవాడలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మరణించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాగండి పేకాట ఆడండి, ఉల్లాసంగా ఉంటారని సాక్షాత్తు సీఎం స్థాయి వ్యక్తి చెప్పడం దారుణమని అన్నారు. చంద్రబాబు తలతిక్క మాటలు మానుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో ఇంత వరకు రైతు రుణమాఫీ కాలేదన్నారు. డ్వాక్రా మహిళల కోసం వైయస్ ఎంతో చేస్తే, చంద్రబాబు మాత్రం మహిళా సంఘాల్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో డ్వాక్రా మహిళల వద్దకు ఓటేసేందుకు వెళితే, పేడ నీళ్ల సన్మానం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించలేకపోయారని గుర్తు చేసిన రోజా... ఇలానే జరిగితే భవిష్యత్తులో మహిళల దగ్గర చంద్రబాబుకు చీపురు దెబ్బలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చంద్రబాబు మండిపడ్డారు. తప్పు చేసిన చంద్రబాబు నాయుడిని నిలదీయాలని ప్రజలకు సూచించారు. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో ప్రతి ఇష్యూపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతోందని అన్నారు.