సభ నుంచి బయటకు వెళ్లిన రోజా: 'కాదు అని చెప్పే ధైర్యం జగన్కు ఉందా?'
హైదరాబాద్: ఏపీ శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండ్కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజా శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయారు. సస్పెన్షన్కు గురైన రోజా శాసనసభ నుంచి బయటకు వెళ్తే గానీ, వైసీపీ సభ్యులకు అవకాశం ఇవ్వనని స్పీకర్ స్పష్టం చేశారు.
స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా వైసీపీ ఎమ్మెల్యే రోజా సభా సాంప్రదాయాలను పాటించాలని, స్పీకర్ ఆదేశాలను అనుసరించి బయటకు వెళ్లాలని ఆమెకు సూచించారు. సభ హుందాతనాన్ని కాపాడాలని, సభలో ఎలా ప్రవర్తించాలో సభ్యులకు నేర్పించాలని ప్రతిపక్ష నేత జగన్కు స్పీకర్ కోడెల సూచించారు.
శాసనసభలో ఎవరు వల్గర్గా మాట్లాడిన వారు శిక్షార్హులేనని అన్నారు. ఇకపోతే బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడిన మాటలను వేరన్నారు. సస్పెన్షన్ అనేది పన్షిమెంట్గా ఇచ్చేదన్నారు. ప్రస్తుతానికి ఆమె బయటకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సభ జరగక్కుండా రచ్చ చేస్తున్నారు: కాల్వ శ్రీనివాసులు
కాల్మనీ వ్యవహారంపై సభలో రెండు రోజులు చర్చ చేపట్టాలని డిమాండ్ చేసిన ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అసలు చర్చే జరగకుండా రచ్చ చేస్తున్నారని ఏపీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.
ఈ సందర్భంగా కాల్మనీ వ్యవహారంలో నిందితులుగా ఉన్న 65 మంది వైసీపీ నేతల పేర్లను సభలో ఆయన చదివి వినిపించారు. తాను చదివి వినిపించిన పేర్లు వైసీపీ నేతలవి కాదు అని చెప్పే ధైర్యం వైయస్ జగన్కు ఉందా చెప్పాలని డిమాండ్ చేశారు.
కాల్మనీ కేసులో నిందితులుగా ఉన్న వారంతా వైసీపీకి చెందిన వారేనని అందుకే జగన్ సభ జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు వైయస్ జగన్ పెట్టింది పేరని ధ్వజమెత్తారు. నిందితులు ఏ పార్టీ వారైనా ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు.