పోలీస్లు జాబుల కోసమే..: చంద్రబాబుకు రోజా ఝలక్, కోర్టులో పిటిషన్
మహిళా సదస్సుకు వచ్చిన తనను అక్రమంగా నిర్బంధించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా మంగళవారం నాడు గన్నవరం కోర్టులో ప్రయివేటు పిటిషన్ దాఖలు చేశారు.
విజయవాడ: మహిళా సదస్సుకు వచ్చిన తనను అక్రమంగా నిర్బంధించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా మంగళవారం నాడు గన్నవరం కోర్టులో ప్రయివేటు పిటిషన్ దాఖలు చేశారు.
పోలీసులు తనను చట్టవిరుద్ధంగా అడ్డుకున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు తనను ఆహ్వానించి నిర్బంధించారని పిటిషన్లో పేర్కొన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
న్యాయం జరుగుతుందనే చట్టాల తలుపుతట్టానని రోజా చెప్పారు. విజయవాడలో ఏడాదిలో 11 శాతం క్రైమ్ పెరిగిందని చెప్పారు. మహిళా ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. సామాన్య మహిళలకు రక్షణ ఉంటుందా అన్నారు.

పిలిచి అవమానించారు
విశాఖ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు కోసం తనకు ఆహ్వాన పత్రిక ఇచ్చి అవమానించారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసిందన్నారు.

చంద్రబాబు మహిళా వ్యతిరేకి
చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని రోజా మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని హక్కులను కాలరాస్తున్నారని చెప్పారు. అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించారన్నారు. మహిళా అధికారులపై టిడిపి నేతలు దాడులు చేస్తున్నారన్నారు.

ఈ ఆర్టికల్స్ ఏమయ్యాయి?
ఆర్టికల్ 19, 20, 21 ఏమయ్యాయని వైసిపి లీగల్ సెల్ నేత ప్రశ్నించారు. ప్రభుత్వం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాసిందన్నారు. పోలీసు అధికారులు తమ పోస్టులను కాపాడుకోవడానికి రోజాను అడ్డుకున్నారని చెప్పారు.

కోర్టు దృష్టికి..
చట్ట వ్యతిరేక చర్యలను కోర్టు దృష్టికి తీసుకు వచ్చామని చెప్పారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ప్రజలు ఈ రెండేళ్లు ఓర్చుకోవాలని, ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్యానించారు. ఏం జరిగినా అందరం కలిసి పోరాడుదామన్నారు.

న్యాయం ఉండదా?
ఏడాదిలో డెబ్బై రేప్లు ఏపీలో జరిగాయన్నారు. ఎమ్మెల్యేలకు రక్షణ లేకుంటే సామాన్యులు ఎవరికి చెప్పుకుంటారని ప్రశ్నించారు. అధికార పక్షానికి ఓ న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయమా అని నిలదీశారు.












Click it and Unblock the Notifications