బాబూ! నేను కాదు.. నువ్వు సిగ్గుతో తలదించుకో, నీ అంతు చూస్తా: రోజా కంటతడి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పైన దుమ్మెత్తి పోశారు. సిగ్గుతో తలదించుకోవాల్సింది నేను కాదని, ఆయనేనని కంటతడి పెట్టారు. చంద్రబాబు అంతు చూసేదాకా వదిలేది లేదని శపథం చేశారు. ఆమె లోటస్ పాండులో విలేకరులతో మాట్లాడారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. గతంలో రైతు ఆత్మహత్యల పైన జగన్ మాట్లాడితే మైక్ కట్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలు ప్రజల్లోకి వెళ్లకుండా అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందన్నారు. తాను దళిత మహిళలను తిట్టినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
నేను ఏం మాట్లాడాను? ఎందుకు మాట్లాడాను? అనే విషయమై ప్రజలకు చెప్పాలన్నారు. టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ రౌడీలా ప్రవర్తించినప్పుడు ఏం చేశారన్నారు. సభలో తాను ఏం చెప్పకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని రోజా కంటతడి పెట్టారు.
సభలో టిడిపి నేతలు ఉచ్చులో ఇరుక్కున్న సమయంలో చూపించడం లేదని రోజా మండిపడ్డారు. చంద్రబాబు మహిళలు, ఎస్సీ, ఎస్టీలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్ కేసులో చంద్రబాబు తాను ఇరుక్కోకుండా ఉండేందుకు మహిళలను అడ్డు పెట్టుకుంటున్నారన్నారు.
చంద్రబాబుకు, టిడిపికి అంబేడ్కర్ పైన ఎంత గౌరవం ఉందో అసెంబ్లీ ఎదుట ఉన్న రాజ్యాంగ నిర్మాత విగ్రహం చూస్తేనే అర్థమవుతోందన్నారు. దానిని తాము శుభ్రం చేశామన్నారు. అంబేడ్కర్ పైన గౌరవం ఉందని చెబుతున్న చంద్రబాబు... ఆయన రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారన్నారు.
చంద్రబాబు కొత్త లోన్లు ఇవ్వలేదని, రుణాలు మాఫీ చేయలేదని, బెజవాడలో అప్పులు చేస్తున్నారన్నారు. టిడిపి నేతల ఇళ్లలో కూడా వారి మహిళలను మహిళలను లాక్కొని వెళ్తుంటే మీ కడుపు తరుక్కుపోదా అని ప్రశ్నించారు. నా హావభావాలు టిడిపిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నాయన్నారు.
టిడిపిలో ఉన్నప్పుడు బాగున్న తన హావభావాలు, ఇప్పుడు ఎందుకు బాగా లేవన్నారు. రిషికేశ్వరి, వనజాక్షి ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు వనజాక్షి జిల్లా హద్దు దాటి వచ్చారని చెబుతున్నారని, అలా చేస్తే ఆమెను సస్పెండ్ చేయాలన్నారు.
ప్రభుత్వ అధికారి పైన చేయి చేసుకున్న చింతమనేని ప్రభాకర్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యల పైన ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. టిడిపి నేతలు ప్రతిపక్ష నేత పైన కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ప్రజలకు ఏం సందేశం ఇచ్చిందన్నారు. తనను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం ద్వారా ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇలాగే ఉంటుందని హెచ్చరిక అనే సందేశం ఇచ్చారని అభిప్రాయపడ్డారు.
మీ పబ్లిసిటీ పిచ్చితో, మీ షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో 31 మంది చనిపోయారని, రిషికేశ్వరి ఆత్మహత్య, వనజాక్షి ఘటన.. ఇలాంటి ఘటనల వల్ల చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని, నేను సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం లేదన్నారు.