చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఆ ఒక్క 'క్లిప్'నే పదేపదే చూపించకండి: రోజా
జగన్ మాట్లాడిన ఒక్క మాటనే పదేపదే చూపించి.. బస్సు ప్రమాదంలో మరణించిన పదకొండు వారి ఆత్మలకు శాంతి లేకుండా చేయవద్దని సూచించారు.
విజయవాడ: మంగళవారం నాడు నందిగామ ప్రభుత్వాసుపత్రిలో వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరుపై అధికార పక్షం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. కలెక్టర్ ను సెంట్రల్ జైలుకు పంపిస్తా అంటూ జగన్ హెచ్చరించిన తీరు విమర్శలను మూటగట్టుకుంటోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వివాదంపై స్పందించారు. బస్సు ప్రమాద ఘటన బాధితులకు న్యాయం చేయాలని ప్రశ్నిస్తే.. జగన్ పై కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎందుకీ కుట్రలంటూ నిలదీశారు. ఆసుపత్రిలో జగన్ తీరుపై వస్తోన్న విమర్శలను తిప్పికొడుతూ.. అక్కడ అధికారులు ప్రవర్తించిన తీరు బాగా లేదన్నారు.

ఏ రాష్ట్రంలోనైనా.. ఓ ఐఏఎస్ అధికారి ఇలా వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయా? అని రోజా ప్రశ్నించారు. మీడియా సోదరులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, జగన్ మాట్లాడిన ఆ ఒక్క మాటను.. పదేపదే టీవీలో క్లిప్పింగ్స్ వేసి అసలు విషయాన్ని పక్కకు మళ్లించవద్దని కోరారు.
బాధితులకు న్యాయం చేయాల్సిన పరిస్థితుల్లోనే జగన్ కలెక్టర్ తో వాగ్వాదానికి దిగాల్సి వచ్చిందని తెలిపారు. జగన్ మాట్లాడిన ఒక్క మాటనే పదేపదే చూపించి.. బస్సు ప్రమాదంలో మరణించిన పదకొండు వారి ఆత్మలకు శాంతి లేకుండా చేయవద్దని సూచించారు. 11మంది ప్రాణాలు పోవడానికి కారణమైన జేసీ ట్రావెల్స్ యాజమాన్యాన్ని టీడీపీ ప్రభుత్వ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని రోజా నిలదీశారు.
ఘటనపై సరైన దర్యాప్తు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతీ విషయంలోను నోరు పారేసుకునే దేవినేని ఉమా ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని ఘటనాస్థలికి కూడా రాకుండా మీడియా ముందు ఏవో రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోయారని రోజా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications