బాబుకు కౌంట్డౌన్: కుట్రలు చేసే చరిత్ర ఆయనదే, హమీలు నెరవేరుస్తాం: రోజా
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నిర్వహించే ప్రజా సంకల్పయాత్రతో చంద్రబాబుకు కౌంట్డౌన్ ప్రారంభంకానుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ధీమాను వ్యక్తం చేశారు.
హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నిర్వహించే ప్రజా సంకల్పయాత్రతో చంద్రబాబుకు కౌంట్డౌన్ ప్రారంభంకానుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ధీమాను వ్యక్తం చేశారు.రాష్ట్రంలో వైసీపీ నేతలు అశాంతికి పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబునాయుడు టిడిపి సమన్వయకమిటీ సమావేశంలో చేసిన ఆరోపణలపై రోజా ధీటుగా స్పందించారు.
Recommended Video
కుట్ర రాజకీయాలకు పాల్పడేది చంద్రబాబునాయుడేనని ఆమె ఆరోపణలు చేశారు. తన రాజకీయ జీవితంలో చంద్రబాబునాయుడు అనేక కుట్రలకు పాల్పడ్డారని రోజా ఆరోపణలు గుప్పించారు. ఆమె అమరావతిలో గురువారం నాడు మీడియాతో మాట్లాడారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో తమ పార్టీకి చెందిన నేతల పేర్లు బయటకు వస్తాయనే నెపంతోనే చంద్రబాబునాయుడు తిరుపతిలో తమిళనాడు కూలీలను కాల్చి చంపించారని చెప్పారు.
ఎన్నికల సమయంలో 15 ఏళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రబాబునాయుడు తన ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా అంశాన్ని మరిచిపోయారని రోజా విమర్శించారు.
చంద్రబాబునాయుడు కారణంగానే ఉమ్మడి రాజధానికి వినియోగించుకొనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఓటుకు నోటు కేసు కారణంగా చంద్రబాబునాయుడు కేంద్రానికి దాసోహమయ్యారని రోజా ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మకై జగన్పై కేసులు పెట్టించారని ఆమె చెప్పారు.తుని ఘటనలకు టిడిపి నేతలే కారణమని ఆమె ఆరోపించారు. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్న రూరల్ ఎస్పీని ఎందుకు బదిలీ చేశారని ఆమె ప్రశ్నించారు. టిడిపి నేతల పేర్లు బయటకు వస్తాయనే నెపంతోనే ఆయనను బదిలీ చేశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను చంద్రబాబునాయుడు నెరవేర్చలేదని ఆమె అన్నారు. 600 వాగ్ధానాలు చేసి ఏ ఒక్కటీ కూడ నెరవేర్చలేదని చంద్రబాబును ఆమె దుయ్యబట్టారు.
ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చే నైజనం రాజన్న కుటుంబానికి ఉందని ఆమె గుర్తుచేశారు.రాజశేఖర్రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హమీలను ఎలా అమలు చేశారో ఆమె ప్రస్తావించారు. చంద్రబాబు కుట్రలను బట్టబయలు చేస్తామని ఆమె హెచ్చరించారు.