మండలిలో సిఎం, 'నిప్పు... చంద్రబాబు వద్దకెళ్లాలంటేనే భయమేస్తోంది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన మండలికి హాజరయ్యారు. ప్రత్యేక హోదా తీర్మానం నేపథ్యంలో ఆయన మండలిలో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకమన్నారు.
హోదా కోసం ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. విభజన జరిగిన తీరు బాధాకరమన్నారు. అందరికీ న్యాయం చేసేలా విభజన జరిగి ఉంటే సమస్యలు వచ్చి ఉండేవి కాదన్నారు. హడావుడిగా రక్షణ శాఖ విమానంలో విభజన బిల్లును పంపించారన్నారు.
రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని తాను అప్పుడు కోరానని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలా సరిదిద్దుతారో కూడా సరిగా చెప్పలేదన్నారు.
రాజ్యసభలో వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ కోరితే ఆ తర్వాత వారు ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారన్నారు. సమైక్య ఏపీలో తాను హైదరాబాదును అభివృద్ధి చేశానని చెప్పారు. హైదరాబాదును ఇప్పుడు మనం కోల్పోయామన్నారు.
చంద్రబాబు వద్దకు పోవాలంటే భయమేస్తోంది: వైసిపి ఎమ్మెల్యే కాకాని
శాసన సభ నుంచి వైసిపి ఎమ్మెల్యేలు గురువారం వాకౌట్ చేశారు. అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు వద్దకు పోవాలంటేనే తమకు భయమేస్తోందన్నారు.
ఏం మాట్లాడినా.. నేను నిప్పు.. నేను నిప్పు (నిజాయితీగా ఉంటానని చెప్పే సందర్భంలో) అంటున్నారని, అందుకే ఆయన వద్దకు వెళ్లాలంటేనే భయమేస్తోందన్నారు. బుల్డోజ్ చేసి బిల్లులు పాస్ చేయాలని అధికార పార్టీ చూస్తోందని మండిపడ్డారు.
వారిపై చర్యలు: యనమల
అసెంబ్లీ లాబీల్లో వైసిపి నేతలు సభాపతి అనుమతి లేకుండా వైయస్ చిత్రాలు అంటించడంపై చర్యలు ఉంటాయని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చర్యలు తీసుకోవడానికి సభ్యుల ఫిర్యాదు అవసరం లేదన్నారు. సభా హక్కుల ఉల్లంఘన కింద సుమోటోగా స్వీకరించవచ్చన్నారు. కేవీపీ రామచంద్ర రావు రాసిన లేఖ కూడా సభాహక్కుల ఉల్లంఘన కింద పరిగణించవచ్చన్నారు. సభ్యులు కాని వారిని కమిటీ ముందుకు పిలిపించవచ్చన్నారు. వివరణ ఇచ్చి క్షమాపణ చెబితే వివాదం సద్దుమణుగుతుందని లేదంటే జైలుకు పంపించే అధికారం సభాపతికి ఉందన్నారు.