దద్దరిల్లిన సభ: 'చిప్పకూడు తినేందుకు సిద్ధం కండి', 'ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్'
హైదరాబాద్: రోజా సస్పెన్షన్ విషయంలో సభ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలంతా నల్ల దుస్తులతో శనివారం సభకు హాజరయ్యారు.
స్పీకర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు వెల్లోకి దూసుకు వచ్చి నినాదాలు చేశారు. 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేసుకుంటూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. చప్పట్లు కొడుతూ, నినాదాలు చేస్తూ సభను హోరెత్తించారు.
ఈ క్రమంలోస్పీకర్ కోడెల శివప్రసాద్, విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
తాము ఇప్పటివరకు దాదాపు 20 సార్లు ప్రివిలేజెస్ కమిటీకి ఫిర్యాదుచేసినా ఒక్కసారి కూడా విచారణకు ఆదేశించలేదని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. బుచ్చయ్య చౌదరి ఎంత అసభ్యంగా మాట్లాడుతూ మహిళలను కించపరిచారో చూశామని, ఆయనపై ఫిర్యాదుచేసినా చర్యలు లేవన్నారు.
బోండా ఉమా అయితే 'మిమ్మల్ని పాతేస్తాం' అన్నా ఆ మాటలను కనీసం రికార్డు నుంచి తొలగించలేదని, చర్యలు తీసుకోలేదన్నారు. రావెల కిశోర్ బాబు విచిత్రమైన భాష మాట్లాడారని, దానిపైనా ఫిర్యాదు చేశామని అన్నారు. ఇక మంత్రి ఉమామహేశ్వరరావు 'మిమ్మల్ని తగలబెట్టేస్తాం, అంతుచూస్తాం' అన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

'ఏకంగా సభా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అంతుతేలుస్తా, పిచ్చాస్పత్రిలో చేరుస్తా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. మంత్రి కామినేని శ్రీనివాస్ సైకోలు, పందులు అంటూ అన్ పార్లమెంటరీ మాటలు ఉపయోగించారు. ఇలా చేస్తే ఎవరికి వాళ్లమీద గౌరవం పెరుగుతుందని' శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
అన్ని ఆధారాలతో మేం ఫిర్యాదుచేస్తే ఏ ఒక్కదానిపైనా విచారణ కూడా జరపడం లేదన్నారు. సభలో స్పీకర్ ఎంత ఎంత స్వార్థంతో వ్యవహరిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రోజా సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపక్షం పూర్తిగా వ్యతిరేకించినా అది ఏకగ్రీవం ఎలా అవుతుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ అధికారముందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ మార్షల్ ఇద్దరూ త్వరలోనే జైలుకు వెళ్లి చిప్పకూడు తినేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు వాళ్లిద్దరికీ ఈ శిక్ష తప్పదని తెలిపారు.
న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు అమలుచేయాల్సిన అవసరం లేదని వీళ్లు అనుకుంటున్నారని, తమ తీర్పులే అంతిమం అని భావిస్తున్నారన్నారు. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా వస్తే గౌరవిస్తారు, లేకపోతే లేదా? అని ప్రశ్నించారు. తమిళనాడు, కర్ణాటకలో కూడా స్పీకర్ల నిర్ణయాన్ని కోర్టులు తప్పుబట్టాయని తెలిపారు.
యూపీలో 1964లో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేను 7 రోజులు అరెస్టు చేస్తే లక్నో కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని, డివిజన్ బెంచి కూడా సింగిల్ బెంచి తీర్పును సమర్థించిందని తెలిపారు. రాష్ట్రపతి న్యాయసలహా కోరితే సుప్రీంకోర్టు కూడా వ్యక్తి హక్కులకు భంగం కలిగించకూడదనే చెప్పిందని గుర్తు చేశారు.
ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా సభా వ్యవహారాలు జరిగినప్పుడే 212 అధికరణ పనిచేస్తుందని, అలా కాకుండా జరిగితే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ముందే చెప్పారన్నారు. కోర్టు తీర్పు ఇచ్చాక దాన్ని అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెవిరెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications