జగన్ సిద్ధం సభకు దూరంగా ఆ వైసీపీ ఎమ్మెల్యే-గుడ్ బై చెప్పేస్తారా ?
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల వ్యవహారం ఓవైపు కలకలం రేపుతుండగా.. మరోవైపు క్యాడర్ లో స్ధైర్యం నింపేందుకు స్వయంగా సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విశాఖ జిల్లా భీమిలిలో సిద్ధం తొలి సభ నిర్వహించిన వైఎస్ జగన్ .. ఎల్లుండి ఏలూరు పక్కనే ఉన్న దెందులూరులో రెండో సభ నిర్వహణకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సిద్ధం సభ ఏర్పాట్లలో నిమగ్నం కావాల్సిన వైసీపీ ఎమ్మెల్యే ఒకరు దూరంగా ఉండిపోవడం చర్చకు దారి తీస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ మధ్య అవకాశం దొరికినప్పుడల్లా పార్టీపై సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం, అలాగే కాంట్రాక్టర్లతో పనులు చేయించుకుని బిల్లులు చెల్లించకపోవడంపై ప్రభుత్వాన్ని వసంత టార్గెట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తిరిగి వైసీపీ నుంచి ఆయన పోటీ చేస్తారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది.

వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో వసంత ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో ఎలాంటి మార్పూ చోటు చేసుకోలేదు. అంటే వసంత కృష్ణప్రసాద్ పరిస్దితి సేఫ్ అన్నమాటే. అయితే వసంత మాత్రం తిరిగి వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా లేరని చెప్తున్నారు. దీంతో ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారానికి బలమిచ్చే విధంగా ఆయన ఇవాళ మరో సంకేతం ఇచ్చేశారు.
ఎల్లుండి ఏలూరులో జరిగే వైఎస్ జగన్ సిద్ధం సభకు వైసీపీ క్యాడర్, నేతల్ని పంపేందుకు దక్షిణాంధ్రలోని చాలా నియోజకవర్గాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ మైలవరంలో మాత్రం వసంత వైసీపీ నేతల్ని సిద్ధం సభకు సిద్ధం చేయకుండా దూరంగా ఉండిపోయారు. దీంతో ఆ బాధ్యతను పార్లమెంట్ ఇన్ ఛార్జ్ అయిన కేశినేని నాని చేపడుతున్నారు. దీంతో ఎల్లుండి సీఎం సభకు రాకపోతే మాత్రం మైలవరం ఎమ్మెల్యే వసంత ఇక వైసీపీకి దూరమైనట్లే భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications