ఆ ఇద్దరితో నాకు ప్రాణహాని... వెంటపడుతూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు... : వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి
తాడికొండ వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనకు ప్రాణహాని ఉందని గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాడికొండ నియోజకవర్గానికి చెందిన శృంగారపాటి సందీప్,చలివేంద్ర సురేష్లు కొంతకాలంగా తనను బ్లాక్మెయిల్ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తాడికొండ నియోజకవర్గంలో ఈ ఇద్దరు చట్ట వ్యతిరేకంగా మద్యం వ్యాపారం,పేకాట నిర్వహిస్తూ పట్టుబడ్డారని గుర్తుచేశారు. దీంతో మండల పార్టీ నాయకులు వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో.. అప్పటి నుంచి తనపై కక్ష కట్టారని ఆరోపించారు.
ఆ ఇద్దరు నా వెంటపడుతున్నారు..: ఎమ్మెల్యే శ్రీదేవి
పార్టీ నుంచి బహిష్కరించడానికి తానే కారణమని... అధిష్టానానికి చెప్పి తానే వారిని సస్పెండ్ చేయించానని ఆ ఇద్దరు భావిస్తున్నట్లు శ్రీదేవి తెలిపారు. దీంతో తనపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని... తన గొంతు మార్ఫింగ్ చేసి తనను అవమానానికి గురిచేస్తున్నారని చెప్పారు. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు... తననే ఫాలో చేస్తూ ప్రాణహాని తలపెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆ ఇద్దరు అనుచరులే అన్న ఆరోపణలు...
ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు చేసిన ఫిర్యాదు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. నిజానికి ఆమె ఎవరిపై ఆరోపణలు చేశారో... సదరు వ్యక్తులు గతంలో ఎమ్మెల్యే అనుచరులే అన్న ప్రచారం ఉంది. శృంగారపాటి సందీప్, చలివేంద్ర సురేష్ ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయంలోనే ఉండి.. నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారన్న ఆరోపణలున్నాయి. అధికారుల బదిలీలు,నిరుద్యోగుల నుంచి డబ్బుల వసూళ్లు.. ఇలా వారిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో... ఇక ఆ ఇద్దరినీ పక్కనపెట్టేయాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే.. వీరిపై సస్పెన్షన్ వేటు వేయాలని స్వయంగా సిఫారసు చేశారన్న ప్రచారం ఉంది.
వరుస వివాదాల్లో శ్రీదేవి...
ఎమ్మెల్యే శ్రీదేవి గెలిచింది మొదటిసారే అయినప్పటికీ వరుస వివాదాలతో ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ముఖ్యంగా తాడికొండలో పేకాట క్లబ్ వ్యవహారంలో ఆమెపై వచ్చిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. అయితే ఆ ఆరోపణలను శ్రీదేవి గతంలోనే ఖండించారు. ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యేగా,డాక్టరుగా ఉండి... ఇలా పేకాట క్లబ్ నిర్వహించాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అసలు పేకాట జరుగుతున్న నంబూరు గ్రామానికి తన నియోజకవర్గంతో సంబంధం లేదన్నారు.తనపై అసత్య కథనాలు ప్రచారం చేసే మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మహిళా నేతను అణిచివేసే ధోరణి కాకుండా నిజాలు, ప్రజలకు చేరవేయాలని ఎమ్మెల్యే శ్రీదేవి హితవు పలికారు.