స్పీకర్ కోడెలను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎందుకంటే...
ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరితోపాటు గతంలోనూ పార్టీ జంప్ చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు.
అమరావతి: ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు స్పీకర్ ను కోరారు.
రాజేశ్వరిని అనర్హురాలిగా ప్రకటించాలని, అలాగే గతంలో పార్టీ మారిన ఎమ్యెల్యేలపై ఇచ్చిన ఫిర్యాదులపై కూడా వెంటనే చర్యలు వైసీపీ ఎమ్మెల్యేలు కోరారు. వంతల రాజేశ్వరి ఈనెల 4వ తేదీన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కండువా వేసి రాజేశ్వరి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సందర్భంగా చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధిని చూసే తాను టీడీపీలో చేరానని, తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని రాజేశ్వరి పేర్కొన్నారు.
ఈ సందర్బంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని ప్రభుత్వం నడిపిస్తున్నారని విమర్శించారు. దేశంలో విపక్ష ఎమ్మెల్యేలతో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని ఆయన ఎద్దేవా చేశారు.