'ప్రభుత్వాన్ని కూల్చుతారా, జగన్ సీఎం ఐతే ఏపీ మాయమయ్యేది'
హైదరాబాద్: ఏపీలో అభివృద్ధిని చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మతిభ్రమించిందని మంత్రి పత్తిపాటి పుల్లారావు గురువారం నాడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పడం అవివేకమన్నారు.
ప్రజా సమస్యలను జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. టిడిపి ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లవలసిన అవసరం లేదని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నది ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాదని, ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపేందుకని పత్తిపాటి మండిపడ్డారు.
రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అభద్రతా భావంలో ఉన్నారన్నారు. జగన్కు అధికారం ఇచ్చి ఉంటే ఈ పాటికి ఏపీ కనుమరుగయ్యేదన్నారు. మా పార్టీలోకి రమ్మని ఎవరినీ అడగడం లేదన్నారు.
టిడిపి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోస్తామనడం జగన్ అవివేకమని మంత్రి నారాయణ అన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి జగన్కు మతి భ్రమించిందని, అందుకే అలా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు.

జగన్ అవివేకి అని ఆనం వివేకానంద రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం మంచిగా నడుస్తుంటే గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేయడం విడ్డూరమన్నారు. తద్వారా జగన్ తన దుర్మార్గాన్ని నిరూపించుకున్నారన్నారు. ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పడం జగన్ అవివేకానికి నిదర్శనమన్నారు.
రాజధాని నిర్మాణం విజయవంతం కావాలని...
తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో విష్ణు సహస్ర నామ స్త్రోత్ర విరాట్ పారాయణాన్ని త్రిదండి చినజీయర్ స్వామీజీ ప్రారంభించారు. రాజధాని నిర్మాణం విజయవంతంగా పూర్తి కావాలనే ఆకాంక్షతో పారాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications