ఎర్రన్నాయుడితో చంద్రబాబు అనుబంధం: కుమార్తెను ఆప్యాయంగా పలకరించారు
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు శుక్రవారం విజయవాడలో టీడీపీలో చేరారు. రాజమహేంద్రవరం నుంచి శుక్రవారం ఉదయం 100 బస్సులు, 150 కార్లతో భారీగా తన అనుచరులతో కలసి విజయవాడ వెళ్లిన ఆదిరెడ్డి, సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
ఆదిరెడ్డి వెంట ఆయన సతీమణి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాజీ మేయర్ వీరరాఘవమ్మ, ఆయన కుమారుడు వాసు, కోడలు భవానీ, ఇద్దరు మనవళ్లు కూడా విజయవాడ వచ్చారు. కుటుంబమంతా పచ్చ కండువాలు ధరించి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నేతలు, మహిళా నేతలు కూడా పసుపు కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన వేదికపై పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ దివంగత నేత ఎర్రన్నాయుడికి వియ్యంకుడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వెంట అక్కడికి వచ్చిన ఎర్రన్నాయుడి కూతురు, తన కోడలు భవానిని ఆదిరెడ్డి చంద్రబాబుకు పరిచయం చేశారు.
ఎర్రన్నాయుడితో చంద్రబాబు అనుబంధం: కుమార్తెను ఆప్యాయంగా పలకరించారు
టీడీపీలోకి చేరిన సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా గౌరవంగా పలకరించే చంద్రబాబును వదిలి వైసీపీలో చేరి తప్పు చేశానని అన్నారు. 20 ఏళ్లు తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీ మారిన తాను తిరిగి టీడీపీలోకి వెళ్తానని జగన్మోహన్రెడ్డికి ఎప్పుడూ అనుమానం ఉండేదన్నారు.
ఎర్రన్నాయుడితో చంద్రబాబు అనుబంధం: కుమార్తెను ఆప్యాయంగా పలకరించారు
‘ఈయన ఉండడు... ఉండడు అనేవాడు. ఉండకపోతేనే మంచిదని మళ్లీ ఆప్యాయతను, అభిమానాన్ని వెతుక్కుంటూ వచ్చా' అని తెలిపారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు ఒక పనిని సమర్థంగా చేస్తే చంద్రబాబు అభినందించేవారని, జగన్ వద్ద పనికి విలువ లేదని ఆయన జగన్ను ఉద్దశించి వ్యాఖ్యానించారు.
ఎర్రన్నాయుడితో చంద్రబాబు అనుబంధం: కుమార్తెను ఆప్యాయంగా పలకరించారు
దురదృష్టవశాత్తు టీడీపీని వదిలిపెట్టి పోయానని, అభిమానంగా చూసే చంద్రబాబును వదిలి పార్టీ మారడం తన భార్యకు కూడా నచ్చలేదని చెప్పారు. కాగా, అప్పారావు పార్టీ మారినా ఆయన భార్య వీరరాఘవమ్మ మనసు ఎప్పుడూ టీడీపీతోనే ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడిని తలచుకుని బాధపడ్డారు.
ఎర్రన్నాయుడితో చంద్రబాబు అనుబంధం: కుమార్తెను ఆప్యాయంగా పలకరించారు
‘నేను పాదయాత్రలో ఉండగా ఓరోజు ఉదయం ఎర్రన్నాయుడు ఇక లేరన్న వార్త వచ్చింది. తట్టుకోలేకపోయాను. కోలుకోలేకపోయాను. నేను చెప్పిన పని తూచ తప్పకుండా అమలు చేసిన నేత ఎర్రన్నాయుడు' అని ఈ సందర్భంగా ఆయన స్మృతులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ఎర్రన్నాయుడితో చంద్రబాబు అనుబంధం: కుమార్తెను ఆప్యాయంగా పలకరించారు
ఆదిరెడ్డి అప్పారావు కోడలు, ఎర్రన్నాయుడి కుమార్తె అయిన భవానిని చూపిస్తూ.. అప్పారావు పార్టీ మారాక ఆమెకు ఓ ఇబ్బంది వచ్చిందని, కుటుంబంతో ఉండక తప్పని పరిస్థితి ఓవైపు, టీడీపీని వదల్లేక మరోవైపు ఇబ్బంది పడిందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఎర్రన్నాయుడితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. భవానీని ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు అనంతరం ఆమె పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారితో సెల్పీ దిగారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రూ, జడ్పీ చైర్మన్ నామన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత గన్ని కృష్ణ గైర్హాజరయ్యారు. ఆయన ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే ఆయన అనుచరులు కూడా ఆదిరెడ్డి చేరిక కార్యక్రమానికి హాజరుకాకపోవడం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.