‘‘అచ్చెన్నాయుడూ.. నీ అబద్ధాలకు సాక్ష్యాలివిగో.. దమ్ముంటే వచ్చి చూడు’’
మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్ దుర్ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారంటూ వైఎస్సార్సీపీ బృందం మండిపడింది.
ఏలూరు: ''పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్ యాజమాన్యం ధన దాహానికి ఐదుగురు కార్మికులు బలైపోగా.. మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. మృతుల కుటుంబాలను కించపరిచే విధంగా, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు..'' అంటూ వైఎస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని నేతృత్వంలోని బృందం మండిపడింది.
ఆనంద్ ఆక్వా ప్లాంట్ నిర్వహణ నిబంధనల మేరకే జరుగుతోందని, ఫ్యాక్టరీ వ్యర్థాలను కలిపేందుకు గొంతేరు డ్రెయిన్ లో వేసిన పైప్ లైన్లను ఎప్పుడో పీకేశారని మంత్రి అసెంబ్లీలో పేర్కొన్నారని, మరి ఇవేంటి అంటూ.. ఇంకా గొంతేరు డ్రెయిన్ కు అనుసంధానంగా ఉన్న ఆ ఫ్యాక్టరీ పైప్ లైన్ గొట్టాల దృశ్యాలను చూపిస్తూ ప్రశ్నించారు.
ఆళ్ల నానితోపాటు నరసాపురం, పాలకొల్లు పార్టీ నియోజకవర్గాల కన్వీనర్లు మునూరి ప్రసాదరాజు, గుణ్ణం నాగబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, ఇతర పార్టీల నేతలు మీడియాతో కలిసి మొగల్తూరు నల్లంవారి తోటలో ఉన్న ఆనంద ఆక్వా ప్లాంట్ ను మంగళవారం సందర్శించారు.
ఇప్పటికీ ఉన్న పైప్ లైన్లు కళ్లెదురుగా కనిపిస్తోంటే.. ఐదు నెలల క్రితమే తొలగించేశారని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ఎలా చెప్పారని వారు ప్రశ్నించారు. తరువాత ఈ బృందం కార్మికుల ప్రాణాలు బలిగొన్న ప్లాంట్ ఆవరణలోని ట్యాంక్ ను కూడా పరిశీలించింది.

ఆ ట్యాంక్ నుంచి విషవాయువులకు సంబంధించిన దుర్వాసన ఇంకా తగ్గకపోవడాన్ని గమనించింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగినట్లుగా మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఎలా చేస్తున్నారని ఎమ్మెల్సీ ఆళ్ల నాని ప్రశ్నించారు. అనంతరం గొంతేరు డ్రెయిన్ ను పరిశీలించిన బృందం వ్యర్థాలు ఎక్కడెక్కడ కలుస్తున్నాయో స్వయంగా చూసింది.
దమ్మంటే వచ్చి చూడండి: ఆళ్ల నాని సవాల్
అసెంబ్లీ సాక్షిగా ఈ ఘటనపై అబద్ధాలు చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడికి దమ్ముంటే మీడియాతో కలిసి ఫ్యాక్టరీ వద్దకు వచ్చి స్వయంగా పరిశీలించాలని ఆళ్ల నాని సవాల్ విసిరారు. '' నీ అబద్ధాలకు సంబంధించిన రుజువులు అలాగే ఉన్నాయి. వాటిని చూసైనా కళ్లు తెరుస్తావా?'' అని ప్రశ్నించారు.
గత ఏడాది మార్చిలో స్థానిక రైతులు, మత్స్యకారులు ఆనంద ఆక్వా ప్లాంట్ పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని, చివరికి తుందుర్రిలో వైఎస్ జగన్ పర్యటించిన తరువాత ప్రభుత్వంలో చలనం వచ్చిందని, నవంబర్ నెలలో అధికారుల కమిటీ వచ్చి ప్లాంట్ ను పరిశీలించిందని, కాలుష్య నియంత్రణ మండలి కూడా ఈ ప్లాంట్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు నివేదిక ఇచ్చిందని, పరిస్థితిలో మార్పు రాకపోతే నోటీసు కూడా ఇవ్వకుండా సీజ్ చేయాలంటూ ఆదేశించిందని, మరి అప్పుడు కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని బృందం ప్రశ్నించంది.












Click it and Unblock the Notifications