ఆ విషయం చంద్రబాబు పీఏ మనోహర్కు ముందే తెలుసు..!!
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఉద్రిక్తతల మధ్య మొదలైంది. మూడు రోజుల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అన్ని మండలాలకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కుప్పం పర్యటన చేపట్టారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తత..
చంద్రబాబు కుప్పానికి చేరుకోక ముందు నుంచే నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో నిర్వహించిన రోడ్ షో, బహిరంగ సభల్లో 11 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రకరాం- రోడ్ షోలను గానీ, రోడ్లపై బహిరంగ సభలను గానీ నిర్వహించడం నిషేధం. ఈ ఉత్తర్వులు జారీ అయిన రెండో రోజే కుప్పం పర్యటనకు వచ్చారు చంద్రబాబు.

ప్రచార రథం డ్రైవర్ అరెస్ట్..
ఈ నేపథ్యంలో- చంద్రబాబు రోడ్ షోగా తరలి వెళ్లాల్సిన వాహన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్టేషన్ కు తరలించారు. ఈ పరిణామాలు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి- పోలీసులపై చేయి చేసుకున్నట్లు సమాచారం.

భరత్ మండిపాటు..
దీనిపై కుప్పం వైఎస్ఆర్సీపీ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు టీడీపీ సభల్లో చోటుచేసుకున్న మరణాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే కుప్పం టూర్ పెట్టుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు గొడవలను సృష్టించడానికే ఇక్కడిక వస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ప్రజలంటే ఏ మాత్రం గౌరవం లేదని, 11 మంది మరణించినప్పటికీ కనీసం పశ్చాత్తాప పడట్లేదని విమర్శించారు.

వీధి రౌడీలా..
ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉంటూ చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నాడని భరత్ ఆరోపించారు. రోడ్డు షోలు, రోడ్లపై మీటింగులకు అనుమతి లేదని పోలీసులు చెప్పినప్పటికీ వినిపించుకోవట్లేదని, పోలీసులపైనే దాడి చేశారని విమర్శించారు. 11 మందిని చంపిన తరువాత రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు తనను రానివ్వరనే ఉద్దేశంతోనే సొంత నియోజకవర్గంలో పర్యటన పెట్టుకున్నాడని ఆరోపించారాయన.

పీఏకు ముందే సమాచారం..
జీవో నెంబర్ 1 ప్రకారం రోడ్డు షోలకు అనుమతి లేదనే విషయం చంద్రబాబు తెలుసునని, ఈ విషయం పీఏ మనోహర్కు పోలీసులు ముందుగానే స్పష్టంగా వివరించారని భరత్ అన్నారు. పోలీసుల మాటను కూడా లెక్కచేయకుండా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని, ఇంకెంత మందిని చంపాలని కుప్పానికి ఆయన వస్తున్నారని నిలదీశారు. ఏదో ఒక అలజడి సృష్టించాలనేదే చంద్రబాబు పన్నాగమని, ప్రజల నుంచి సానుభూతి కోసం చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నాడని ఆరోపించారు.












Click it and Unblock the Notifications