వైసీపీకి ఎంపీ లావు గుడ్ బై - అదే బాటలో మరో ముఖ్య నేత..!?
వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పుతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలను జగన్ సర్వే నివేదికల ఆధారంగా మార్పులు చేస్తున్నారు. నర్సరావుపేట ప్రస్తుత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం నర్సరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుంటూరుకు మారాలని సీఎం సూచించారు. అందుకు ఎంపీ నో అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు టచ్ లోకి వచ్చారు. మరో ముఖ్య నేతతోనూ టీడీపీ నేతలు సంప్రదింపులు మొదలు పెట్టారు.
Recommended Video

మార్పులు - చేర్పులు: ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీల సీట్లలోనూ మార్పులు చేస్తున్నారు. నర్సరావు పేట నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ను వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ సూచించారు. నర్సరావు పేట సీటు రెడ్డి లేదా బీసీ వర్గానికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నర్సరావుపేట పార్లమెంటరీ పరిధిలోని నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం జగన్ ను కలిసి ఎంపీని మార్చవద్దని కోరారు.

అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు ను గుంటూరుకు పంపితే సీటు గెలవటంతో పాటుగా ఎమ్మెల్యేల గెలుపుకు మేలు చేస్తుందని సీఎం చెప్పుకొచ్చారు. కానీ, ఇందుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ససేమిరా అంటున్నారు. నర్సరావుపేటలో కొనసాగిస్తే పోటీ చేస్తానని..లేకుంటే తన నిర్ణయం తాను తీసుకుంటానని స్పష్టం చేస్తున్నారు.
టచ్ లోకి టీడీపీ నేతలు: ఇదే సమయంలో టీడీపీ ముఖ్య నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలుతో సంప్రదింపులు ప్రారంభించారు. నర్సరావుపేట నుంచే టీడీపీ అభ్యర్దిగా అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. నర్సరావుపేటలో ఎంపీగా కేంద్ర నిధులతో పాటుగా సొంత నిధులతో లావు శ్రీకృష్ణదేవరాయలు పలు కార్యక్రమాలు నిర్వహించారు.
నర్సరావుపేట ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని లావు శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. శ్రీకృష్ణదేవరాయలును నర్సరావుపేటలో కొనసాగిస్తే ఆయన పార్టీలోనే ఉండే అవకాశం ఉంది. సీటు మార్చితే టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో..వైసీపీ నాయకత్వం అలర్ట్ అయింది.

సీఎం జగన్ కసరత్తు: గుంటూరు, నర్సరావుపేట స్థానాల విషయంలో లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎంపీ మోదుగుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి మరోసారి లావు శ్రీకృష్ణదేవరాయలుతో మాట్లాడుతున్నారు. అటు మోదుగులతోనూ సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ రోజు ఈ సీట్లపైన తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేసిన క్రిష్ణా జిల్లాకు చెందిన సీనియర్ అయిన బీసీ నేత టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
అదే విధంగా ఒంగోలు ఎంపీ వ్యవహారం పైన తర్జన భర్జన జరుగుతోంది. నెల్లూరు జిల్లాలో వైసీపీకి అన్ని రకాలు గా అండగా నిలిచిన మరో ప్రముఖ నేతకు టీడీపీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో..ఎంపీల వ్యవహారం ప్రస్తుతం పెండింగ్ పెట్టి..వీరి విషయంలో మరోసారి చర్చలు చేయాలనేది వైసీపీ నాయకత్వం ఆలోచన గా తెలుస్తోంది. దీంతో..గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వైసీపీ ముఖ్య నేతల అడుగులు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications