అవును, చంద్రబాబుకు whatsapp చేశా, తప్పేంటి? -సీఎం జగన్ pegasus వాడట్లేదా? :ఎంపీ రఘురామ మరో బాంబు
రాజద్రోహం కేసులో అరెస్టయి, బెయిల్ పై ఉన్న నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పంచుకున్నట్లు అంగీకరించారు. ఎంపీపై రాజద్రోహం కేసులో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆయనీ విషయాన్ని చెప్పారు. అంతేకాదు, దేశాన్ని కుదిపేస్తోన్న పెగాసస్ నిఘా ఉదంతానికీ ఏపీ సీఎంకు లింకుపెడుతూ రఘురామ అనూహ్య ఆరోపణలు చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
జగన్ ఆదేశం, మోదీ శాసనం -బెయిల్ రద్దు తథ్యం -లక్ష్మీపార్వతి జూదం -కేసీఆర్ జగడం: రఘురామ సంచలనం
పారిపోడానికి సిద్ధంగా కేసీఆర్ బినామీలు -భారీ కుంభకోణం -ఐజీ ప్రభాకర్ పైనా -రేవంత్ రెడ్డి తాజా బాంబు
చంద్రబాబుతో చాటింగ్ తప్పేంటి?
''రాజద్రోహం పేరుతో తప్పుడు ఆరోపణలపై నన్ను అరెస్టు చేసిన సమయంలో సీఐడీ వాళ్లు నా ఫోన్ లాక్కున్నారు. అది యాపిల్ ఫోన్. అయినాకూడా కోడ్ ను బ్రేక్ చేసిమరీ, కల్పిత వాట్సప్ మెసేజ్ లు సృష్టించి, నాపై ట్రోలింగ్ కు దిగుతున్నారు. అసలీ వాట్సాప్ మెసేజ్ లకు శాంటిటీనే లేదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. అయినాసరే దురాలోచనతో జగన్ సర్కారు నా వాట్సాప్ చాటింగ్ ను తెరపైకి తెచ్చింది. అవును, జగన్ సీబీఐ బెయిల్ రద్దు చేయాలని నేను పిటిషన్ వేశాను, దానికి సంబంధించిన సమాచారాన్ని వేల మందిలో పంచుకున్నాను. అందులో చంద్రబాబు కూడా ఉండొచ్చు. నేను చంద్రబాబుకు వాట్సాప్ మెసేజ్ పెట్టింది నిజమే అనుకున్నా, అది రాజద్రోహం అవుతుందా?
నిమ్మగడ్డ ఫుటేజీ ఎలా దొరికింది?
ఏపీ సీఐడీ విచారణలో ఉన్న కేసు అంశాలు.. సాక్షి పత్రికలో కల్పిత కథనాలుగా రావడమేంటి? నిబంధనలకు విరుద్ధంగా నా ఫోన్ కోడ్ బ్రేక చేయడమే కాకుండా అందులో నేను ఎవరికో వాట్సాప్ చేశానన్న సమాచారం సాక్షి పత్రికకు ఎవరిచ్చారు? గతంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కూడా ఏదో హోటల్ లో ఎవరినో కలిస్తే ఆ ఫుటేజీ సాక్షి మీడియాకే ముందుగా ఎలా దొరికింది? నా ఫోన్ లో నేను ఎవరికో మెసేజ్ లు పెట్టుకుంటే వీళ్లకేంటి నొప్పి? జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను షేర్ చేసుకుంటే రాజద్రోహం అవుతుందా? మరి చంద్రబాబుతో మరో 2వేల మందికి దాన్ని షేర్ చేశాను. అసలు నువ్వు ఎవరు అడగటానికి? అంతగా..
ఆ చావులకు బాధ్యులు ఎవరు?
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, రాజధాని తరలింపునకే అదే కారణమని సీఎం, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పదే పదే చెప్పారు. దాన్ని సాక్షి మీడియాలో కథనాలుగా రాయడంతో మనస్తాపం చెంది అమరావతిలో 150 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ మరణాలకు బాధ్యులెవరు? నిజంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ మూలాలు కావాలంటే, విశాఖలో విచారణ చేయించండి. అసలు, సాక్షి మీడియాకు తండ్రుల జాబితాలో జగన్ పేరు ఎక్కడా ఉండదు. దాని పుట్టుకే అపవిత్రం. అవినీతి పత్రికలో రోజూ చెత్తవార్తలు రాసి, పార్లమెంట్ సభ్యులను అల్లరిపాలు చేస్తారా? నిజంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలనుకుంటే జగన్ మీడియాకు నాదొక సవాలు. సాక్షి ఆర్థిక మూలాలు, దానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో అన్ని వివరాలతో తెలంగాణ హైకోర్టులో ఇటీవలే ఒక పిటిషన్ వేశాను, దమ్ముంటే అందులోని అంశాలను ప్రచురించండి. ఈ వాట్సాప్ చాటింగ్ ఆరోపణలతో మీరు నన్నేమీ చేయలేరు. ఇప్పుడు దేశమంతటినీ కుదిపేస్తోన్న అంశం..
జగన్ పెగాసెస్ వాడుతున్నాడుగా..
కేంద్ర ప్రభుత్వం పెగాసెస్ అనే మాల్ వేర్ ద్వారా దేశంలోని రాజకీయ నేతలందరిపై నిఘా కొనసాగిస్తోందని ప్రస్తుతం పార్లమెంటులో రచ్చ కొనసాగుతోంది. నిజానికి కేంద్ర అంత పెద్ద ఎత్తున పెగాసెస్ మాల్ వేర్ వాడిందంటే నమ్మడం కష్టం. కానీ దాన్ని ఏపీలో జగన్ ముందునుంచే వాడుతున్నట్లు నా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది. జగన్ సర్కారువాటిన పెగాసిస్ సాఫ్ట్ వేర్ టెరిట్రీ ఇంటర్ సెప్టార్ మాడ్యులర్ సాయంతో 5 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ఫోన్లపై నిఘా ఉంచొచ్చని, ఇన్ పుట్ ఇచ్చిన వాయిస్ ఫ్రీక్వెన్సీలను ఆ సాఫ్ట్ వేర్ ను జగన్ సర్కారు వాడిందని నాకు తెలిసింది. మరి అందుకోసం ఏపీ సర్కారు కేంద్రం నుంచి అనుమతి తీసుకుందా? లేదా చెప్పాలి..
Recommended Video
నా వల్లే జగన్ స్టాండ్ మారింది.. సంతోషం
ఎంపీగా నాపై అనర్హత వేటు వేయించడం జగన్ వల్ల అయ్యేపని కాదు. నా పేరుతో పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేస్తామని ప్రకటించిన వైసీపీ.. ఇప్పుడు అనూహ్యంగా ప్రజా సమస్యలపై మాట్లాడుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిధులు లాంటి అంశాలపై వైసీపీ ఎంపీలు ప్లకార్డులతో పార్లమెంటులో గొడవ చేస్తున్నారు. ఈ మార్పు నా వల్లే వచ్చింది. నాపై పోరాటం ఎలాగో ఫలించదు కాబట్టే, జగన్ స్టాండ్ మార్చుకుని కనీసం రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై ఎంపీలతో మాట్లాడిస్తున్నారు. ఇది చాలా సంతోషకర పరిణామం. గతంలో బీజేపీ ఎంపీల సంఖ్య ఎక్కువ కాబట్టి హోదాపై పోరాటం చేయలేమన్న జగన్.. ఇవాళ బీజేపీ సంఖ్య తగ్గకున్నా, వైసీపీ సంఖ్య పెరగకున్నా పార్లమెంటులో ఆందోళనలు చేయిస్తుండటం వెనుక నేను ఉండటం నాకెంతో గర్వకారణం. ఇది నిజంగా చిత్తశుద్దితో చేసే పోరాటమైతే, ఏపీ హోదా కోసం జగన్ ఆదేశిస్తే, అందరు ఎంపీలతోపాటే నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అలా ఆదేశించే దమ్ము జగన్ కు ఉందా?'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.