కొడాలి నాని ఉద్దేశం అదేనా? కోర్టుకు వెళ్లాలి: రఘురామ కృష్ణరాజు తీవ్ర స్పందన
న్యూఢిల్లీ: రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. అమరావతి నుంచి రాజధానిని పూర్తిస్థాయిలో తరలించాలన్న కొడాలి నాని తన ఉద్దేశాన్ని బయటపెట్టాలని అన్నారు.
మంత్రి కొడాలి నాని బెదిరిస్తున్నారా?
న్యూఢిల్లీలో మంగళవారం రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ వైఖరిని మంత్రి కొడాలి ప్రకటించారని అన్నారు. కోర్టులో కేసులు ఉపసంహరించుకోకుంటే శాసన రాజధానిని కూడా తరలిస్తామని బెదిరిస్తున్నట్లు మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలున్నాయని వ్యాఖ్యానించారు. కొడాలి వ్యాఖ్యల నేపథ్యంలో దీనిపై రైతులు హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తే మంచిదని రఘురామ సూచించారు. అక్షరాస్యతలో ఏపీ చివరి స్థానంలో నిలవడం విచారకరమని రఘురామ వ్యాఖ్యానించారు.
ప్రజలకు నగదు బదిలీపై నమ్మకం లేదు..
అంతర్వేది రథం దగ్ధం విషయంలో సిట్ ఏర్పాటు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామ సూచించారు. ఇక ఉచిత నగదు బదిలీపై రైతులకు సందేహాలు, అపోహలు ఉన్నాయని రఘురామ అన్నారు. రైతుల ఆందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ప్రజలకు నగదు బదిలీపై నమ్మకం కలగడం లేదని చెప్పారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని శ్రీకాకుళంలో కాకుండా కడపలో మొదలు పెట్టాలని ఎంపీ రఘురామ సూచించారు.
Recommended Video
అమరావతిపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు ఇలా..
కాగా, పేద ప్రజలు ఉండేందుకు వీల్లేని అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండేందుకు వీల్లేదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు మంత్రి కొడాలని నాని సోమవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనిపై అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారంటూ తెలిపారు. అమరావతిలో 55వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిపై కోర్టు వెళ్లి తీసుకురావడం విడ్డూరమని అన్నారు. కాగా, ప్రస్తుతం అమరావతి శాసన రాజధానిగా, విశాఖ పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తామని ఏపీ సర్కారు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.