నిమ్మగడ్డ రహస్యభేటీ లీకైందిలా -హరీశ్ సాల్వే ఉచిత వాదన -కొత్త దేవుడిలా జగన్: ఎంపీ రఘురామ

అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమై మూడేళ్లు పూర్తికావొస్తున్న సందర్భంలో దాన్నొక పండుగలా జరుపుకోవాలంటూ రాష్ట్ర ప్రజలకు వైసీపీ పిలుపునివ్వడాన్ని ఆ పార్టీకే చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్రంగా తప్పుపట్టారు. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, అసలు నిజాలు ఇవీ అంటూ ఎంపీ కొన్ని కీలక అంశాలను పేర్కొన్నారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

40 ఏళ్ల కిందటి సినిమాలా..

40 ఏళ్ల కిందటి సినిమాలా..

‘‘నవంబర్ 6తో మా ప్రియతమ నేత జగన్ పాదయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తవుతోన్న నేపథ్యంలో వైసీపీ ప్రజా సంబంధాల ఇంచార్జి సజ్జల రామకృష్ణారెడ్డి.. శ్రేణులకు కొన్ని ఆదేశాలిచ్చారు. ఈనెల 6 నుంచి 16 వరకు పాదయాత్ర వార్షికోత్సవాన్ని ఊరూరా పండుగలా నిర్వహించాలని, జగన్ లాంటి అరుదైన నాయకుడు ఈ తరంలో ఉండటం గొప్ప విషయంగా చాటిచెప్పాలని, ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యులు చేయాలని, 17 నెలల పాలనలో ఏవైనా లోపాలుంటే తెలుసుకుంటామని కూడా సజ్జల మెసేజ్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే నాకు 40 ఏళ్ల కిందటి బాపు సినిమా ‘రాజాధిరాజు' గుర్తుకొస్తున్నది. ఆ సినిమాలో ‘కొత్త దేవుడండీ.. కొంగొత్త దేవుడండీ..' అనే పాట మాదిరిగా జగన్ ను కొత్త దేవుడిలా చేసే కార్యక్రమానికి మా వాళ్లు పూనుకున్నారు. వ్యక్తిత్వంలోగానీ, ఆహార్యంలోగానీ సింపుల్ గా ఉండే జగన్ కు ఇలాంటి చిల్లర పబ్లిసిటీ అసలు ఇష్టం ఉండదని నా భావన. పాదయాత్రను పండుగలా చేసుకోమనడం ఏమిటో, బతికుండాగానే సీఎంను దేవుడిగా చూడాలనడం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఇక..

నిమ్మగడ్డ రహస్య భేటీ వీడియో..

నిమ్మగడ్డ రహస్య భేటీ వీడియో..

ఏపీలో పున:ప్రారంభమైన స్కూళ్లకు కరోనా బెడద లేదని విద్యామంత్రి ఆదిమూలపు సురేశ్ చెబుతున్నారు. చంటి పిల్లల్ని కరోనాతో సహజీవనం చేయమని ఆయన అర్థమా? మూడు నెలలు స్కూళ్లు లేకుంటే ఏం కొంప మునుగుతుంది? కరోనా విషయంలో ఇంత సాహసం ప్రదర్శించేవాళ్లు మరి ఎన్నికల నిర్వహణకు ఎందుకు భయపడుతున్నట్లు? ఎన్నికల నిర్వహణపై కోర్టులు చివాట్లు పెడితే సిగ్గు పడాల్సింది పోయి.. కోర్టు వ్యవహారాలపై వైసీపీ నేతలు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. నిన్న మరో కీలక నేత(గడికోట శ్రీకాంత్ రెడ్డి) ప్రెస్ మీట్ లో.. హైకోర్టుకు నిమ్మగడ్డ సమర్పించిన అఫిడవిట్ తేదీ గురించి ప్రశ్నించారు. జగన్ మీడియాలో రాసినంత మాత్రాన హైకోర్టు కార్యకలాపాల తేదీలు మారబోవని ఆ నేత గుర్తిస్తే మంచింది. సాక్షి ప్రస్తావన వచ్చింది కాబట్టి నిమ్మగడ్డ రహస్య భేటీ అంటూ ఆ టీవీలో ప్రసారమైన వీడియో క్లిప్పింగుల గురించి కీలకమైన విషయాలు చెబుతాను..

హరీశ్ సాల్వే పైసా తీసుకోలేదు..

హరీశ్ సాల్వే పైసా తీసుకోలేదు..

ప్రజాభిమానం వైసీపీకి అనుకూలంగా ఉందని భావిస్తే ఎన్నికల కమిషనర్ కు భయపడటం ఎందుకు? నిజంగా ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభావితం చేయగల శక్తి నిమ్మగడ్డకు ఉందా? అతను అంత శక్తిమంతుడైతే వైసీపీ ఇన్ని రకాలుగా అవాకులు చెవాకులు పేలగలదా? ఎక్కడో చెట్టు తొర్రలో కాకుండా, పట్టపగలు పబ్లిక్ ప్లేస్ అయిన పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ వ్యక్తిగతంగా ఎవరినో కలిస్తే.. ఆ హోటల్ వాళ్లను మేనేజ్ చేసి, పోలీసుల ద్వారా సీసీటీవీ వీడియో క్లిప్పింపులను చేజిక్కించుకున్నారు. అసలా క్లిప్పింగ్స్ సాక్షి మీడియా చేతికి ఎలా వచ్చాయి? మీరు రహస్యంగా ఫుటేజ్ తెప్పించుకుని.. నిమ్మగడ్డది రహస్య భేటీ అని లీక్ చేయడం ఎంతవరకు సమంజసం? ఆయన లాయర్ల ఫీజుల మీద కూడా ఏవేవో అభాండాలు వేశారు. న్యాయవ్యవస్థ ఆపదలో ఉన్నప్పుడు దాన్ని కాపాడటం కోసం గొప్ప లాయర్లు చాలా మంది ముందుకొస్తారు. నిమ్మగడ్డ తరఫున వాదించిన ప్రముఖ లాయర్ హరీశ్ సాల్వే ఒక్కపైసా తీసుకోలేదు. ఉచితంగా వాదించారు. ఎవరు పడితే వాళ్లు, ఏది పడితే అది మాట్లాడటం వల్ల అంతిమంగా జగన్ కే నష్టం జరుగుతుందని మా పార్టీ నేతలు గుర్తించట్లేదు. కోర్టుకు సంబంధించిందే మరో అంశం..

కడపపై బ్రౌన్ దొరకు మక్కువ..

కడపపై బ్రౌన్ దొరకు మక్కువ..

స్కూళ్లు ప్రారంభమైన సందర్భంగా ఇంగ్లీష్ మీడియంపై వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై డిసెంబర్ 14లోగా కోర్టు తీర్పు రావొచ్చు. తెలుగుతనానికి ప్రతీకలుగా ఎన్టీఆర్, వైఎస్సార్ నిలుస్తారు. అలాగే నాటి ఈస్టిండియా కంపెనీ అధికారి సీపీ బ్రౌన్ కూడా తెగులు భాషా పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేశారు. నాడు కడప సబ్ కలెక్టర్ గా పనిచేసిన బ్రౌన్ దొరకు ఆ ఊరంటే మమకారం ఎక్కువ. తన జీతం డబ్బుల్ని కూడా తెలుగు భాషాభివృద్ధికి, తాళపత్ర గ్రంధాల పరిరక్షణకు వాడారు. కడపలో ఆయన పేరుతో ఉన్న లైబ్రరీని వైఎస్సార్ హయాంలో డిజిటలైజ్ చేశారు. ప్రస్తుతం తెలుగును చంపేసి, ఇంగ్లీషును తెస్తే తప్ప యూనిటీ రాదని భావిస్తోన్న మా అధినేత ఒక్కసారి బ్రౌన్ దొరను గుర్తించాలి. కడప కేంద్రంగా బ్రౌన్ దొర తెలుగు భాషను బతికించిన తీరును, ఇప్పటికీ తెలుగు-ఇంగ్లీష్ డిక్షనరీలో బ్రౌన్ డిక్షనరీనే ప్రామాణికంగా చూస్తున్న వైనాన్ని జగన్ గుర్తుచేసుకోవాలి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. కాగా,

 ఎట్టకేలకు రచ్చబండ కుదింపు..

ఎట్టకేలకు రచ్చబండ కుదింపు..

వైఎస్సార్ హయాంలో అద్భుతమైన పాలన సాగిందని, తొలి టర్మ్ లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, వాటిని విజయవంతంగా నిర్వహించినప్పటికీ రెండో టర్మ్ లో వైఎస్సార్ కు మెజార్టీ తక్కువగా వచ్చిందని, దాంతో తన పాలనలోని లోపాలను ప్రజల ద్వారానే తెలుసుకునేందుకు వైఎస్సార్ ‘రచ్చబండ' కార్యక్రమాన్ని తలపెట్టారని, ఆయన స్ఫూర్తితోనే ప్రజా సమస్యలపై తాను ‘రాజధాని రచ్చబండ' నిర్వహిస్తున్నానని ఎంపీ రఘురామ చెప్పారు. భగవంతుడికి మంచి స్నేహితులు తక్కువై మహానేత వైఎస్సార్ ను తీసుకెళ్లిపోయారని ఆవేదన చెందారు. కాగా, 120 రోజులుగా సాగిన ‘రాజధాని రచ్చబండ' కార్యక్రమాన్ని ఇకపై ప్రతి రోజూ కాకుండా వారానికి రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తానని రఘురామ తెలిపారు. వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ఎంపీ రఘురామ ప్రతి రోజూ ప్రెస్ మీట్లు పెట్టి సొంత పార్టీపై, ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+