అందుకే మాట్లాడాల్సి వచ్చింది.. వైసీపీ షోకాజ్ నోటీసులపై రఘురామ కృష్ణం రాజు రియాక్షన్...
వైసీపీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుల చేశారు. షోకాజ్ నోటీసులు అందిన తర్వాత చాలామంది తనకు ఫోన్లు బైట్ కావాలని,కలవాలని అడుగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఎవరినీ తనవద్దకు రావొద్దని చెప్పానని... అలాగే షోకాజ్ నోటీసులపై తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు వీడియో ద్వారా ప్రజల ముందుకు వచ్చానని తెలిపారు. నోటీసులపై సున్నితంగానే స్పందించిన ఎంపీ.. గురువారం(జూన్ 25) పార్టీకి లిఖితపూర్వక సమాధానం పంపిస్తానని చెప్పారు.

18 పేజీల షోకాజ్ నోటీసు...
'ఈరోజు మధ్యాహ్నం నాకు షోకాజ్ నోటీసు వచ్చింది. చాలామంది బైట్ కావాలని,కలవాలని నాకు ఫోన్లు చేశారు. అయితే కరోనా సమయంలో అందరూ ఇక్కడికి రావడం సరికాదు కాబట్టి ఈ వీడియోను విడుదల చేస్తున్నాను. మొత్తం 18 పేజీల షోకాజ్ నోటీస్ పంపించారు. అందులో 2 పేజీలు లిఖితపూర్వకంగా ఉన్నాయి. మిగతా 16 పేజీలు రకరకాల పేపర్ క్లిప్పింగ్స్తో ఉన్నాయి. వాటిపై నా సమాధానం అడిగారు.' అని రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేశారు.

అందుకే మాట్లాడాల్సి వచ్చింది.. : ఎంపీ రఘురామ
'ప్రజలందరూ నన్ను మీడియాలో చూస్తూనే ఉన్నారు. పార్టీని గానీ,పార్టీ అధ్యక్షుడిని గానీ నేను పల్లెత్తు మాట అనలేదు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వంలో ప్రజల మంచి కోసం చేపట్టిన కొన్ని పనులు.. కొన్నిచోట్ల సజావుగా జరగట్లేదన్న విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని భావించాను. కానీ సకాలంలో అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో నేనే మీడియా ముఖంగా తిరుపతి దేవస్థాన భూములు సహా కొన్ని విషయాలపై మాట్లాడాను. అయితే అది ప్రభుత్వానికి చేసిన సూచనే గానీ పార్టీని నేనెప్పుడూ ఏమీ అనలేదు. ఇదే సమాధానాన్ని నేను రేపు లిఖితిపూర్వక వివరణతో పార్టీ ఆలిండియా జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డికి పంపిస్తున్నాను. ఆ తర్వాత మళ్లీ మాట్లాడుతాను.' అంటూ చెప్పుకొచ్చారు.
Recommended Video

కొరకరాని కొయ్యగా రఘురామ కృష్ణం రాజు
గత కొద్దిరోజులుగా సొంత పార్టీ పైనే విమర్శలు గుప్పిస్తూ... అదే సమయంలో సీఎం జగన్ను ప్రశంసిస్తూ రఘురామ కృష్ణం రాజు వార్తల్లో నిలుస్తున్నారు. జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో సొంత పార్టీ నేత నుంచే విమర్శలు,ఆరోపణలు రావడం పార్టీలో కలకలం రేపింది. పేదలకు ఇళ్ల నిర్మాణ పథకంలో వైసీపీ నేతలు రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అలాగే ఇసుక విధానంపై విమర్శలు చేశారు. ఈ ఆరోపణలు,విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్స్ మొదలవడంతో... వైసీపీ నేతలు బతిమాలితేనే ఆ పార్టీ తరుపున పోటీ చేశాననంటూ మరింత దుమారం రేపారు. తాను జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని... తన బొమ్మతోనే గెలిచానని అన్నారు. ఇలా రఘురామ కృష్ణం రాజు వ్యవహారం చేయి దాటిపోయేలా ఉండటంతో వైసీపీ షోకాజ్ నోటీసులు ఇవ్వక తప్పలేదు.












Click it and Unblock the Notifications