హైకోర్టు జడ్డీల బదిలీ ఆపండి...కేంద్రానికి వైసీపీ ఎంపీ లేఖ !
దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో న్యాయమూర్తుల్ని వేర్వేరు చోట్లకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఏపీ హైకోర్టులోనూ ఇద్దరు న్యాయమూర్తులకు స్ధాన భ్రంశం తప్పలేదు. హైకోర్టులో ప్రస్తుతం జడ్డీలుగా ఉన్న జస్టిస్ దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు కొలీజియం బదిలీ చేసింది. ఈ నిర్ణయాలపై లాయర్లు నిరసనలు తెలుపుతున్నారు.
హైకోర్టు జడ్డీల బదిలీల్ని నిరసిస్తూ లాయర్లు ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో వాటిని ఆపాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి ఓ లేఖ రాశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు రఘురామ ఇవాళ లేఖ రాశారు. ఇందులో హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్ని పునస్ససమీక్షించాలని కోరారు. రాష్ట్రంలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, లాయర్ల ఆందోళన నేపథ్యంలో ఇద్దరు న్యాయమూర్తుల బదిలీల్ని నిలిపేయాలని రఘురామ న్యాయశాఖ మంత్రికి రాసిన లేఖలో కోరారు.
సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాలను కేంద్రం సమీక్షించి నిలిపేయాలని కిరణ్ రిజిజుకు రాసిన లేఖలో రఘురామరాజు కోరారు. మరోవైపు ఇప్పటికే హైకోర్టు జడ్జీల బదిలీ వ్యవహారంపై లాయర్లు సైతం వైసీపీ, టీడీపీ వర్గాలుగా విడిపోయి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీతో పాటు విపక్షాలకు అనుకూలంగా నిత్యం మాట్లాడే రఘురామరాజు కేంద్రానికి రాసిన లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. అదీ వైసీపీ ప్రభుత్వంపై పలు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులకు మద్దతుగా రఘురామ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.